
Rythu Bharosa scheme Updates : పంటల సాగు సమయంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పథకం కింద ప్రతీయేటా రెండు విడతల్లో ఎకరానికి రూ.12వేలను అర్హులైన రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తోంది. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో రైతుల ఖాతాల్లో పథకం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 30వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి మధిర నియోజకవర్గంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని నిధులను విడుదల చేయనున్నారు.
రైతు భరోసా పథకం ఐదు ఎకరాలలోపు అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేస్తోంది. అయితే, గత రబీ సీజన్లో కేవలం రెండు ఎకరాల వరకు కలిగిన రైతులకు బ్యాంక్ అకౌంట్లలో మాత్రమే రైతు భరోసా నిధులు పడినట్లు తెలుస్తోంది. దీంతో మూడు, నాలుగు, ఐదు ఆపైన విస్తీర్ణంలో భూమి ఉన్నవారికి గతంలో మాదిరిగా ఆర్థిక సహాయం అందక తీవ్ర నిరాశకు గురయ్యారు.
రాష్ట్రంలో 2018లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5వేలు రెండు విడతల్లో రూ.10వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. 2023 డిసెంబర్ నెలలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. రైతు భరోసా పేరుతో ఎకరాకు రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. అయితే, కేవలం రెండు నుంచి మూడు ఎకరాలు కలిగిన అర్హులైన రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అందులోనూ తొలుత ఎకరంకు.. ఆ తరువాత రెండు, మూడు ఎకరాలకు ఇలా విడతల వారిగా రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. అయితే, ఈసారి ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని తెలుస్తోంది.
రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం సీజన్లోనైనా అందరికీ మొత్తం విస్తీర్ణానికి ఆర్థిక సహాయం అందిస్తారా లేక గత యాసంగి సమయంలోలా మళ్లీ రెండు ఎకరాల మేరకే అందిస్తారా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రకటించిన మేరకు తొమ్మిది రోజుల్లో అందరికీ ఆర్థిక సహాయం అందిస్తామని అనడం గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఏడు వేల కోట్ల పైచిలుకు పెట్టుబడి సహాయం ఏడు రోజుల్లో అందించారు.
ప్రస్తుతం ఎకరాకు ఆరు వేల రూపాయల సహాయాన్ని పెంచడంతో అది తొమ్మిది వేల కోట్లకు పెరిగింది. ఒక్కోరోజు ఒక్కో ఎకరం విస్తీర్ణాన్ని పెంచుతూ రైతులందరికీ తొమ్మిది రోజుల్లో సహాయం అందిస్తే రాష్ట్రంలోని సాగుభూమి అంతటికీ రైతుభరోసా సహాయం అందే అవకాశాలున్నాయి. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిరలో జరిగే రైతు సమ్మేళనంలో రైతుభరోసా నిధుల విడుదల ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో ఆరోజు నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమకానున్నది.