
చుంచుపల్లి, జూన్ 20 : రాష్ట్రంలో వాహనదారులపై మరోసారి అదనపు ఆర్థిక భారం పడనున్నట్లు రవాణా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జీవో నెం.
60 అమలుకు సంబంధించి మూడు నెలల క్రితం లారీ యజమానుల సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల అమలుపై మూడు నెలల పాటు సడలింపు లభించినట్లు రవాణా సంఘాల నాయకులు తెలిపారు. ఆ సడలింపు గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 60 అనుగుణంగా రాష్ట్రంలోని 56 రవాణా శాఖ కార్యాలయాల్లో మళ్లీ రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల అమలు ప్రక్రియ భద్రాద్రి కొత్తగూడెం రవాణా శాఖలో. ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందే వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరి చేస్తున్నారని, దీంతో వాహన యజమానులు అదనపు ఖర్చులు భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాహన రకాన్ని బట్టి రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల కోసం రూ.150 నుండి రూ.2,900 వరకు వసూలు చేసే అవకాశం ఉందని రవాణా రంగ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా భారీ సరకు రవాణా వాహనాలు, ట్రక్కులు, బస్సులు, 3,000 కిలోలకు పైగా సామర్థ్యం కలిగిన వాహనాలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడవచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన డీజిల్ ధరలు, టోల్ ఫీజులు, బీమా ప్రీమియంలు, నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవాణా రంగానికి ఈ నిర్ణయం మరో దెబ్బగా మారిందని లారీ యజమానులు అంటున్నారు.
భద్రత పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం వల్ల చిన్న, మధ్య తరహా వాహన యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రోడ్డు భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నప్పటికీ, ధరల నియంత్రణ, అమలు విధానంలో పారదర్శకత, వాహనదారులపై పడే ఆర్థిక భారం అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రవాణా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రిఫ్లెక్టివ్ స్టిక్కర్ల అమలు నేపథ్యంలో వాహనదారుల్లో మరోసారి అసంతృప్తి వ్యక్తమవుతుండగా, ఈ అంశం రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.