
యోగా గురు బాబా రాందేవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు ఒక కర్మయోగి అని అభివర్ణించారు.
అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద శనివారం 'యోగాంధ్ర' కార్యక్రమంలో భాగంగా రాందేవ్ యోగాభ్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షలైన 'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్', 'ఆత్మనిర్భర్ భారత్' వంటి లక్ష్యాల సాధనకు చంద్రబాబు అందిస్తున్న సహకారం అమోఘమని కితాబిచ్చారు. ఆయన నాయకత్వ పటిమను కొనియాడారు.అంతకుముందు పతంజలి యోగా గురుకులం విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో యోగాకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, యోగా అభిమానులు పాల్గొన్నారు.