
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న విడుదలై థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. రాంచరణ్ ఈ మూవీలో క్రాసోవర్ అథ్లెట్ గా వివిధ క్రీడల్లో నైపుణ్యం ఉన్న ఆటగాడిగా నటించారు. రాంచరణ్ నటనకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
పెద్ది మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాలు సాధిస్తోంది. మిగిలిన చోట్ల ఈ చిత్రానికి వసూళ్లు బాగా తగ్గాయి. పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం చేసిన విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ తాజాగా ప్రకటించారు.
పెద్ది కోసం గబ్బర్ సింగ్ త్యాగం ఏంటి అని అనుకుంటున్నారా.. అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే. గబ్బర్ సింగ్ చిత్రాన్ని ఈ నెల 26న రీ రిలీజ్ చేయాలి అని నిర్మాత బండ్ల గణేష్ భావించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి.
కానీ ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ని వాయిదా వేసినట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. దీనికి గల కారణాన్ని వివరిస్తూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "పెద్ది" సినిమా కలెక్షన్లు ప్రభావితం కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. "గబ్బర్ సింగ్" రీ-రిలీజ్కు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాను అని బండ్ల గణేష్ పోస్ట్ చేశారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ పవన్ కళ్యాణ్ కి మాస్ కంబ్యాక్ ఇచ్చింది. మాస్ చిత్రాలలో దీనిని ఐకానిక్ మూవీగా అభిమానులు భావిస్తారు
.