
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 25 ఏళ్ల గాదె సాయికృష్ణ అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఈ ఘటనను కప్పిపుచ్చేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్, డీజీపీ స్థాయి అధికారులు ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.గతంలో నేరచరిత్ర ఉన్న సాయికృష్ణను మే 9వ తేదీన మార్కాపురంలో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి అతని ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కుమారుడిని పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
అయితే, తాము సాయికృష్ణను అదుపులోకి తీసుకోలేదని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు కోర్టుకు విన్నవించారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పోలీసుల వాదనలపై సందేహాలు వ్యక్తం చేసింది. జూన్ 29లోగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.
ఈ పరిణామాల నేపథ్యంలో, ప్రభుత్వం కృష్ణలంక సీఐ నాగరాజును సస్పెండ్ చేసి, ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే హత్య కేసు నమోదు చేయాలని జగన్ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు
.