
YS Jagan: రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రంపచోడవరం నియోజకవర్గ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుంటున్నారని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు మంచి పరిపాలన అందించామని గర్వంగా చెప్పగలమని జగన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలను ఎన్నికల తర్వాత చెత్తబుట్టలో పడేసే రాజకీయ సంస్కృతిని మార్చి, హామీలకు విలువ తీసుకొచ్చిన పార్టీ వైఎస్సార్సీపీ అని పేర్కొన్నారు.
దేశంలో 99 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చాం.. తమ ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని జగన్ గుర్తు చేశారు.
స్కూళ్లు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చామని, రైతులకు అండగా నిలిచామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా వ్యవస్థను తీర్చిదిద్దామని చెప్పారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు.
మూడు లక్షలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను గిరిజన కుటుంబాలకు పంపిణీ చేశామని తెలిపారు. పాడేరు, పార్వతీపురం, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ, సాలూరులో ట్రైబల్ యూనివర్శిటీ తీసుకొచ్చామని చెప్పారు.
ఐటీడీఏ పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండేలా ప్రజలకు సేవ చేశా.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే తపనతో తమ ప్రభుత్వం పనిచేసిందని జగన్ అన్నారు. తాను మరణించిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండేలా
ప్రజలకు సేవ చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన మహిళలకు ఆర్థిక సాయం, అమ్మ ఒడి, అన్నదాత సుఖీభవ వంటి పథకాల అమలులో ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని అన్నారు. గ్యాస్ సిలిండర్ల పంపిణీ విషయంలో కూడా హామీలు నిలబెట్టుకోలేదని విమర్శించారు.
చీకటి కొంతకాలమే ఉంటుంది.. వెలుగు రాక తప్పదు చంద్రబాబు నాయుడుకు ఇంకా మూడేళ్ల పాలన మాత్రమే మిగిలి ఉందని, మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్ ప్రకటించారు. రాష్ట్రంలో అన్యాయమైన పాలన కొనసాగుతోందని, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘చీకటి కొంతకాలమే ఉంటుంది.. వెలుగు రాక తప్పదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున గట్టిగా నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. బాధితులకు అండగా ఉండాలని, పేదలకు సహాయం చేయడంలో ముందుండాలని సూచించారు. జగన్ 2.0లో కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇస్తానని, సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తల చేతుల మీదుగా ప్రజలకు చేరేలా చూస్తానని తెలిపారు వైసీపీ అధినేత వైఎస్ జగన్..