Record India Defence Production : దేశీయ రక్షణ రంగంలో భారతదేశం చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర భారత్ నినాదం సత్ఫలితాలను ఇస్తూ దేశ రక్షణ ఉత్పాదకతను మునుపెన్నడూ లేని స్థాయికి చేర్చింది.
ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత రక్షణ రంగ ఉత్పత్తి ఏకంగా రూ. 1.78 లక్షల కోట్ల ఆల్టైమ్ హై రికార్డును తాకినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (రూ. 1.54 లక్షల కోట్లు)తో పోలిస్తే 15.6 శాతం వృద్ధిని నమోదు చేయడమే కాకుండా..
2020-21 నాటి గణాంకాలతో (రూ. 84,643 కోట్లు) పోల్చితే ఐదేళ్ల కాలంలోనే రెండింతలు కావడం విశేషం. గడిచిన దశాబ్ద కాలంలో దేశీయ రక్షణ తయారీ ఏకంగా నాలుగు రెట్లు పెరగడం గమనార్హం.ప్రైవేటు రంగానిదే కీలక పాత్ర..!ప్రస్తుత రక్షణ ఉత్పత్తుల్లో రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాలు 76 శాతం వాటాను కలిగి ఉండగా..
ప్రైవేట్ రంగం తన భాగస్వామ్యాన్ని 24 శాతానికి పెంచుకుంది. ప్రైవేట్ రంగ రక్షణ ఉత్పత్తి రూ. 42,000 కోట్ల అత్యున్నత స్థాయికి చేరింది. ఈ భారీ దేశీయ తయారీ వల్ల భారత్ రక్షణ ఎగుమతుల్లోనూ సరికొత్త చరిత్ర సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.
38,424 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక సామగ్రిని ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, రక్షణ శాఖ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. బడ్జెట్ 2026 లో రక్షణ రంగానికి కేటాయించిన రూ.
7.85 లక్షల కోట్లు (ఆధునికీకరణ కోసమే రూ. 2.19 లక్షల కోట్లు) ఈ రంగానికి మరింత ఊతాన్నిచ్చాయి.రాబోయే రోజుల్లో లక్షల కోట్ల విలువైన మెగా ప్రాజెక్టులు..భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రానున్న రోజుల్లో అతిపెద్ద రక్షణ కొనుగోలు
ప్రాజెక్టులు పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత వైమానిక దళ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుగా భావిస్తున్న రూ. 3.25 లక్షల కోట్ల వ్యయంతో కూడిన 114 రాఫెల్ యుద్ధ విమానాల తయారీ ఒప్పందం పరిశీలనలో ఉంది. అలాగే రష్యాతో ఐదో తరం 'సుఖోయ్-57'పై చర్చలు జరుపుతూనే.. స్వదేశీ 'ఎల్సీఏ తేజస్ మార్క్ 1ఏ', అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లపై భారత్ పట్టుదలగా ఉంది. అదనంగా 97 తేజస్ విమానాల ఇండక్షన్ కోసం హెచ్ఏఎల్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచింది. హిందూ మహాసముద్రంలో చైనా, పాక్ నౌకాదళాల కదలికలను అడ్డుకునేందుకు జర్మనీకి చెందిన థైసెన్క్రుప్, మజగాన్ డాక్ సంయుక్తంగా 8 బిలియన్ డాలర్ల వ్యయంతో 6 అత్యాధునిక సాంప్రదాయ జలాంతర్గాములను భారత్లోనే నిర్మించనున్నాయి.భారత నౌకాదళంలోకి పూణేకు చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ అభివృద్ధి చేసిన మొట్టమొదటి మానవరహిత ఫాస్ట్ ఇంటర్సెప్టర్ క్రాఫ్ట్లను చేర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవే కాకుండా రూ. 3.84 లక్షల కోట్ల విలువైన క్షిపణులు, ఆర్టిలరీ, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, 156 లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచంద్ల కొనుగోలుకు రక్షణ కొనుగోలు మండలి ఆమోదం తెలిపింది. లక్నోలో బ్రహ్మోస్ క్షిపణుల టెస్టింగ్ ఫెసిలిటీ కూడా తన విధులను ప్రారంభించింది.