
8th Pay Commission:8వ వేతన సంఘం అమలు ఆలస్యమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20 నుంచి 24 నెలల జీత బకాయిలు ఒకేసారి వచ్చే అవకాశం ఉంది. అయితే భారీ మొత్తం ఖాతాలో జమ కావడంతో పన్ను భారం కూడా పెరగవచ్చు. అలాంటి పరిస్థితిలో సెక్షన్ 89(1) కింద పన్ను ఉపశమనం పొందాలంటే ఫారం 10Eను తప్పనిసరిగా సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలుపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కమిషన్ అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా, గత నెలల బకాయిలు కూడా భారీ మొత్తంలో అందే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
8వ వేతన సంఘం సిఫార్సులు పూర్తిగా అమలు కావడానికి కొంత సమయం పట్టవచ్చు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన విధానం ఆలస్యమైతే, ఉద్యోగులకు 20 నుంచి 24 నెలల వరకు జీతాల బకాయిలు ఒకేసారి చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల ఖాతాల్లో భారీ మొత్తం జమ కావచ్చు.
అయితే ఈ సంతోషకరమైన వార్తతో పాటు ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. బకాయిల రూపంలో పెద్ద మొత్తం ఒకేసారి రావడం వల్ల ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం పెరిగిపోతుంది. ఫలితంగా కొంతమంది ఉద్యోగులు ఎక్కువ పన్ను శ్లాబ్లోకి వెళ్లే అవకాశం ఉంది.
దీంతో అదనపు ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులకు ఉపశమనం కల్పించేందుకు ఆదాయపు పన్ను చట్టంలో ప్రత్యేక నిబంధన ఉంది. అదే సెక్షన్ 89(1). ఈ నిబంధన ద్వారా బకాయిల కారణంగా పెరిగిన పన్ను భారాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
బకాయిలు ఏ ఏ సంవత్సరాలకు సంబంధించినవో వాటి ఆధారంగా పన్నును తిరిగి లెక్కించి ఉపశమనం అందిస్తారు. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు ఒక ముఖ్యమైన పని తప్పనిసరిగా చేయాలి
. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు ఫారం 10Eను ఆన్లైన్లో సమర్పించాలి. ఈ ఫారంలో బకాయిలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలి. ఫారం 10E సమర్పించకుండా సెక్షన్ 89(1) కింద పన్ను ఉపశమనం కోరితే ఆదాయపు పన్ను శాఖ దానిని అంగీకరించదు.
అందువల్ల 8వ వేతన సంఘం కింద బకాయిలు పొందే అవకాశం ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లు ముందుగానే పన్ను ప్రణాళికపై అవగాహన పెంచుకోవడం మంచిది. సరైన విధంగా చర్యలు తీసుకుంటే భారీ బకాయిల ప్రయోజనాన్ని పూర్తిగా పొందే అవకాశం ఉంటుంది.