
Telangana Govt Employees Pending DA: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన కరువు భత్యం (DA) బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. జూన్ 2న పీఆర్సీపై ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశలు పెట్టుకోగా..
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ఆరు డీఏలు కూడా విడుదలకు నోచుకోకపోవడంతో ఉద్యోగ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం చివరగా సంక్రాంతి కానుకగా ఉద్యోగులకు పెంచింది. 3.64 శాతం డీఏ పెంచుతూ అప్పుడు నిర్ణయం తీసుకుంది.
అప్పటికి ఐదు డీఏలు పెండింగ్లో పెట్టగా.. త్వరలో మరో డీఏ రానుంది. మొదటి డీఏ 2024 జనవరి 1, రెండో డీఏ 2024 జూలై 1, మూడో డీఏ 2025 జనవరి 1, నాలుగో డీఏ 2025 జూలై 1, ఐదో డీఏ 2026 జనవరి 1 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆరో డీఏ 2026 జూలై 1 నుంచి రానుంది.
గత రెండేళ్లుగా ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 6 డీఏలు పెండింగ్లో ఉండడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ పెండింగ్ డీఏలను ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ప్రభుత్వం వైపు నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదా జీవో (GO) రాలేదు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు డీఏలు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వం దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతుందా అని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
.