
Rythu Bharosa : తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాలు నాటేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రైతు భరోసా పథకం నిధులకోసం చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
దీంతో ప్రభుత్వం రైతు భరోసా పథకం నిధుల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రతీయేటా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఎకరాకు రూ.12వేలను రెండు విడతల్లో (ఖరీఫ్, రబీకి) విడతకు రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పనులు ప్రారంభం కావడంతో రైతులకు పెట్టుబడి సాయం కింద నిధులను జమ చేసేందుకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 18వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వానాకాలం పంటల సాగు, ఎరువులు, విత్తనాలతోపాటు ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై ప్రత్యేకమైన చర్చ జరగనుంది.
వీటితోపాటు రైతు భరోసా పథకం నిధుల విడుదలపై చర్చించనున్నారు. అన్నదాతలు ఎదురుచూస్తున్న రైతుభరోసాను ఒకేసారి రైతులందరి బ్యాంక్ ఖాతాల్లో వేయడం, అది కూడా వానాకాలం పంట సాగుకు ఉపయోగపడేలా ఈ నెలలోనే నిధులను జమ చేసేలా నిర్ణయం తీసుకోనుంది.
ఈ క్రమంలో ఈనెల 26వ తేదీన లేదంటే ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు జమ చేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఎకరాకు రూ.15వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది.
అయితే, అధికారంలోకి వచ్చిన తరువాత ఎకరాకు రూ. 10వేల మొత్తాన్ని రూ.12వేలకు పెంచింది. ఆ మొత్తాన్ని ఖరీఫ్ సాగు సమయంలో రూ.6వేలు, రబీ సాగు సమయంలో రూ.6వేల
చొప్పున విడుదల చేస్తోంది. ఇప్పటి వరకు రూ.19,500 కోట్లను ప్రభుత్వం రైతు భరోసా కింద చెల్లించింది. అయితే, గత వానాకాలం సీజన్లో 69.4లక్షల మంది రైతులకు రూ.8,744 కోట్ల నిధులను రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయగా.. యాసంగి పంట కాలంలో రూ.5,653 కోట్లు మాత్రమే చెల్లించింది. అదికూడా ఆలస్యంగా.. విడతల వారిగా విడుదల చేయడంతో రైతులు కొంత అసహనం వ్యక్తం చేశారు.
ఈసారి రెండు చోట్ల సభలు ఏర్పాటు చేసి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈనెల 26వ తేదీన ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించి.. ఆ వేదికగా రైతు భరోసా పథకం నిధులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. మరో జిల్లాల్లో రెండో సభ నిర్వహించి.. మిగిలిన రైతులకు పథకం నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. అయితే, మొత్తానికి అర్హులైన రైతులందరికీ నెల రోజుల వ్యవధిలోనే రైతు భరోసా నిధులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.