
R Sreelekha : ఇటీవల మలయాళంలో రిలీజయిన దృఢం అనే సినిమా మంచి విజయం అందుకుంది. ఓటీటీలోకి వచ్చాక మరింత రీచ్ తెచ్చుకుంది ఈ సినిమా. ఓ ఊళ్ళో జరిగిన మర్డర్, దొంగతనం కేసులతో క్లైమాక్స్ లో ఊహించని ఓ ట్విస్ట్ తో ఈ సినిమాని పోలీస్ కథగా తెరకెక్కించారు.
అయితే ఈ దృఢం సినిమా కథతో పాటు ఇటీవల వచ్చిన మరో మలయాళం సినిమా భూతకాలం కథ కూడా నావే అంటూ కేరళ బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ శ్రీలేఖ కామెంట్స్ చేసారు. కేరళ బీజేపీ కౌన్సిలర్, మాజీ ఐపీఎస్ అధికారిణి ఆర్.శ్రీలేఖ దీనిపై తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
తన పోస్ట్ లో.. నేను దృఢం అనే సినిమాను చూశాను. ఇది ఒక పోలీస్ కథ అని చూసాను. చాలా ఏళ్ల క్రితం నేను రాసి మాతృభూమి వారపత్రికలో ప్రచురించిన “కరింకుడి పోలీస్ స్టేషన్” అనే చిన్న కథను కాపీ కొట్టే ఈ సినిమా ప్రధాన కథను రాసుకున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నేను ఈ కథను నా యూట్యూబ్ ఛానెల్లో ఆడియో కథగా కూడా అందించాను. అలాగే అనేక అవార్డులు గెలుచుకున్న భూతకాలం అనే సినిమా కూడా సుమారు 5 ఏళ్ల క్రితం నా ఛానెల్లో నేను చెప్పిన ఒక అనుభవ కథ ఆధారంగా ఆ కథను కాపీ కొట్టి రూపొందించబడింది. దీని శీర్షిక కూడా దాదాపు అలాగే ఉంటుంది.
ఆ కథకు నేను పెట్టిన పేరు భూత భవనం. ఈ రెండు సినిమాల మధ్య మరో సంబంధం కూడా ఉంది. రెండింటిలోనూ హీరో షైన్ నిగమ్. పరవ సినిమా చూసినప్పటి నుంచే నాకు ఈ నటుడంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను గతంలో కలిసి పనిచేసిన, తమ్ముడిలా భావించే ఒక పోలీస్ అధికారి ఈ నటుడులా పోలి ఉంటాడు.
ముఖ్యంగా దృఢం
సినిమాలో పోలీస్ పాత్రలో అతను అలా కనిపిస్తాడు అని తెలిపారు.
దీంతో ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అయితే దీనిపై దృఢం దర్శకుడు మార్టిన్ జోసెఫ్ స్పందిస్తూ.. మూవీ చూసిన వారికి ఆమె రాసిన కథతో తీయలేదని అర్థమవుతుంది. ఈ విషయాన్ని మా స్క్రీన్ప్లే రైటర్స్ తో కూడా మాట్లాడాను. మొదటిసారి వాళ్లు ఆ వీడియోను చూసాము అన్నారు. అలాంటప్పుడు ఆమె కథను తీసుకునే అవకాశం ఉండదు అని అన్నారు.