
పెట్రోల్తో పాటు అధిక శాతం ఇథనాల్తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ బైక్ల కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ శుభవార్త చెప్పింది. ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ మోడళ్లపై రూ.4,000 ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది.
ఈ ఆఫర్ 2026 జులై వరకు అందుబాటులో ఉండనుంది.డిస్కౌంట్ తర్వాత స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఎక్స్షోరూమ్ ధర రూ.82,710 నుంచి రూ.78,710కు తగ్గింది. అలాగే హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయెల్ ధర రూ.72,792 నుంచి రూ.68,792కు చేరింది.
దీంతో ఫ్లెక్స్ ఫ్యూయెల్ టెక్నాలజీని ప్రయత్నించాలనుకుంటున్న వినియోగదారులకు ఈ బైక్లు మరింత అందుబాటు ధరలోకి వచ్చాయి.ఈ రెండు బైక్లు E85 ఇంధనంపై నడుస్తాయి. అంటే 85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు.
ఇందుకోసం హీరో సంస్థ ఫ్యూయెల్ పంప్, అదనపు ఫిల్టర్, ఇంజిన్ కంట్రోల్ యూనిట్ వంటి కీలక భాగాల్లో మార్పులు చేసింది. ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని బట్టి ఇంజిన్ పనితీరును ఆటోమేటిక్గా సర్దుబాటు చేసుకునేలా రూపొందించింది.ఈ బైక్లో 97.2 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చారు.
E85 ఇంధనంతో నడిపినప్పుడు సాధారణ పెట్రోల్ మోడళ్లతో పోలిస్తే శక్తి సుమారు 7 శాతం, టార్క్ 3 శాతం పెరుగుతుందని హీరో మోటోకార్ప్ చెబుతోంది. పర్యావరణ హిత ఇంధనాన్ని ప్రోత్సహించడంతో పాటు మెరుగైన పనితీరును అందించడమే లక్ష్యంగా ఈ మోడళ్లను తీసుకొచ్చింది
.