
దొంగలు చిన్న చిన్న వస్తువులు, డబ్బులు, బంగారం దొంగిలించడం మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ, ఏకంగా భారీ మొబైల్ టవర్నే లేపేశారు కొంతమంది కేటుగాళ్లు. ఈ షాకింగ్ ఘటన బిహార్లోని బక్సర్ జిల్లా డుమ్రాన్ టౌన్లో వెలుగుచూసింది. ఏకంగా 132 అడుగుల ఎత్తున్న భారీ మొబైల్ టవర్, దానితో పాటు ఉన్న 15 KVA జనరేటర్ సెట్, ఇతర టెక్నికల్ పరికరాలు ఒక్కసారిగా మాయమైపోయాయి.
ఈ విషయం తెలిసి స్థానికులతో పాటు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు షాక్ అవుతున్నారు. జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (GTL Infrastructure) కంపెనీకి చెందిన అధికారులు, సిబ్బంది జూన్ 10న టవర్ను రిపేర్ చేయడానికి సైట్కు చేరుకున్నారు.
అక్కడకు వెళ్లి చూసేసరికి వారికి గట్టి షాక్ తగిలింది. ఎందుకంటే అక్కడ ఉండాల్సిన 132 అడుగుల భారీ టవర్ పూర్తిగా మాయమైపోయింది. ఈ టవర్ను దాదాపు 10 నుండి 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ల్యాండ్ అగ్రిమెంట్ ముగిసిపోవడంతో గత కొన్నేళ్లుగా ఇది పనిచేయడం లేదు.
ఇదే అడ్వాంటేజ్గా తీసుకున్న దొంగలు, ఎవరికీ అనుమానం రాకుండా కొన్ని రోజుల పాటు సరైన టూల్స్, మెషినరీ ఉపయోగించి ముక్కలు ముక్కలుగా కట్ చేసి దాన్ని దొంగిలించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ టవర్ ఏర్పాటు చేసిన స్థల యజమాని హరినాథ్ యాదవ్ మాట్లాడుతూ, 2010లో కంపెనీతో 12 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు.
2022లో ఈ ఒప్పందం ముగిసిందని, ఆ తర్వాత కంపెనీ తనకు ఎలాంటి పేమెంట్లు చేయలేదని చెప్పారు. దీనిపై కంపెనీకి నాలుగు సార్లు నోటీసులు పంపినా ఎలాంటి స్పందన లేదని, ఇప్పుడు చూస్తే టవర్ మొత్తం మాయమైపోయిందని అన్నారు. స్థానికులు మాట్లాడుతూ, గత 15-20 రోజులుగా అక్కడ టవర్ కనిపించడం లేదని, కంపెనీ వాళ్లే దాన్ని తొలగించారేమోనని తామంతా అనుకున్నామని చెప్పారు.
నివాస ప్రాంతం మధ్యలో ఇంత పెద్ద టవర్, భారీ జనరేటర్ ఎవరికీ తెలియకుండా
ఎలా దొంగిలించారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
ఈ షాకింగ్ దొంగతనంపై జీటీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతినిధి డుమ్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బక్సర్ ఎస్పీ శుభమ్ ఆర్య స్పందిస్తూ.. టవర్ చోరీ పై ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని స్పష్టం చేశారు. చోరీకి గురైన మెటీరియల్ను స్క్రాప్ కింద అమ్మేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
నిజాలు తెలుసుకోవడానికి భూ యజమాని, కంపెనీ అధికారులను, స్థానికులను ప్రశ్నిస్తున్నారు. గతంలో బిహార్లో 60 అడుగుల పొడవైన రైల్వే బ్రిడ్జిని, అలాగే సమస్తీపూర్లో 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ను కూడా దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఈ తాజా ఘటన స్థానికంగా ఆస్తుల భద్రతపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.