తెలంగాణలో నిరుపేదలకు సైతం అత్యాధునిక, ఖరీదైన కార్పొరేట్ వైద్య సేవలను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం వైద్యారోగ్య రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ చుట్టుపక్కల నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రుల రూపురేఖలను మార్చేందుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
గతంలో ఒక్కో టిమ్స్ ఆసుపత్రిలో ఒక్కో రకమైన వ్యాధికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ, మారుతున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ప్రతి ఆసుపత్రిలో రెండేసి సూపర్ స్పెషాలిటీ సేవలను అందించాలని నిర్ణయించారు.ఈ సరికొత్త ప్రణాళిక ప్రకారం.. త్వరలో ప్రారంభం కానున్న సనత్నగర్ టిమ్స్లో ప్రతిష్టాత్మక కార్డియాలజీ విభాగంతో పాటు ఎండోక్రినాలజీ లేదా మరొక సూపర్ స్పెషాలిటీ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
అదేవిధంగా అల్వాల్ టిమ్స్లో న్యూరాలజీ, ఎల్బీనగర్ టిమ్స్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో హెమటాలజీ విభాగాలతో పాటు మరో అనుబంధ ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మొత్తం ఎనిమిది సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు సాధారణ ప్రజలకు చేరువ కానున్నాయి.
ఈ ఆసుపత్రులు ఎలాంటి రాజకీయ లేదా పరిపాలనాపరమైన ఒత్తిళ్లు లేకుండా స్వతంత్రంగా పనిచేసేందుకు వీలుగా ఒక్కో టిమ్స్ ఆసుపత్రికి ప్రత్యేకంగా డైరెక్టర్లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 4150 కోట్ల భారీ రుణం మంజూరు కావడం వైద్య రంగానికి పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఈ భారీ నిధులలో తొలి విడతగా రూ. 1000 కోట్లు జూలై నెలలో విడుదల కానున్నాయి. ఈ నిధులు అందగానే ప్రభుత్వ వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా చిన్నారుల సంరక్షణకు పేరొందిన నీలోఫర్ ఆసుపత్రితో పాటు, క్యాన్సర్ బాధితులకు దిక్కుగా ఉన్న ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రులను పూర్తిస్థాయిలో
ప్రక్షాళన చేయనున్నారు. అధునాతన వైద్య పరికరాల కొనుగోలు, మౌలిక వసతుల కల్పన ద్వారా ఈ రెండు ఆసుపత్రులను ఆధునీకరించి బాధితులకు మెరుగైన ఉచిత సేవలు అందించనున్నారు. సీనియర్ వైద్యుల సలహాలు, సూచనల మేరకు ఎక్కడెక్కడ ఏ సేవలు అవసరమో గుర్తించి, ఈ నిధులను పారదర్శకంగా వినియోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.