
ప్రస్తుతం ప్రధాని మోదీ స్లోవేకియాలో పర్యటిస్తున్నారు. అయితే స్లోవేకియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని ఘనంగా సత్కరించింది. ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్(ఫస్ట్ క్లాస్) ను అందించింది. ఈ అత్యున్నత పౌర పురస్కారంతో ప్రధాని మోదీని వరించిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33 కు చేరింది.
అవార్డు ప్రధానం అనంతరం ఇదే విషయాన్ని తన అధికారిక ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ వివరాలను వెల్లడించారు. " ఈ రాత్రి బ్రాటిస్లావాలో నేను ఈ అంతర్జాతీయ అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్(ఫస్ట్ క్లాస్) ను స్వీకరించడం గౌరవంగా భావిస్తున్నాను.
స్లోవేకియా ప్రభుత్వానికి, ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు 140 కోట్ల మంది భారతీయులకు సొంతం. భారత్- స్లోవేకియా మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని ఆశిస్తున్నాను" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక ప్రధాని మోదీ 2014 లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఇప్పటివరకు 100 విదేశీ పర్యటనలను పూర్తి చేశారు.
ప్రధాని హోదాలో ఇప్పటివరకు 78 దేశాలను సందర్శించారు. 12 ఏళ్లలో దాదాపు 80 దేశాలు.. 100 ఫారిన్ ట్రిప్పులతో ప్రధాని మోదీ నయా రికార్డ్ నెలకొల్పారు. ఇక యూరోప్ పర్యటనలో భాగంగా స్లోవేకియా చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ ప్రభుత్వం ఘనంగా ఆహ్వానం పలికింది.
ఆ తర్వాత స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికో బ్రాటిస్లావాతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య 11 కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇమ్మిగ్రేషన్, డిజిటల్ టెక్నాలజీ, ఢిఫెన్స్ తదితర అంశాలపై ఇరు దేశాల మధ్య అవగాహన కుదిరింది.
అలాగే భారత్- ఈయూ మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ ను త్వరలోనే అమలు చేసే దిశగా ఇరు దేశాలు పని చేయాలని అంగీకరించాయి. మరోవైపు ఫ్రాన్స్ వేదికగా ఇవాళ 52వ జీ7 దేశాల సదస్సు
జరగనుంది. ఈ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ వరుసగా ఏడోసారి ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరవుతున్నారు. ఈ సదస్సులో ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి. సురక్షితమైన, సమర్థవంతమైన పద్ధతులు, న్యాయ సాంకేతికతల్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం, అంతర్జాతీయంగా ఆర్థిక అసమానతలను తగ్గించడం, సమతుల్య అభివృద్ధిని సాధించడం, కీలకమైన ఖనిజాల సరఫరా చైన్ ను బలోపేతం చేయడం తదితర అంశాలపై చర్చించనున్నారు.