
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీల విలీనం విషయంలో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) నేత శంతను డే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తొలుత ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన, తాజాగా 20 మంది టీఎంసీ రెబెల్ ఎంపీలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో టీఎంసీలో నెలకొన్న అంతర్గత సంక్షోభం మరో మలుపు తిరిగింది.కాకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని 20 మంది ఎంపీలు, తమను ఎన్సీపీఐలో విలీనం చేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఇప్పటికే నోటీసు అందజేశారు. చట్టసభల్లో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని వారు స్పష్టం చేశారు.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి మినహాయింపు పొందేందుకు, పార్టీలోని మూడింట రెండొంతుల మంది సభ్యులు వేరే పార్టీలో విలీనం కావొచ్చన్న నిబంధనను వారు ఈ సందర్భంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారు.ఈ పరిణామాలపై తొలుత శంతను డే తీవ్రంగా స్పందించారు. పార్టీ అధ్యక్షుడు ఉత్తీయ కుండు తనతో పాటు ఇతర నేతలను సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
అయితే, సోమవారం జరిగిన పార్టీ సమావేశం అనంతరం ఆయన తన వైఖరిని మార్చుకున్నారు. "మాది చిన్న పార్టీ, పశ్చిమ బెంగాల్ ప్రయోజనాల కోసం పని చేయాలనుకుంటున్నాం. కొత్తగా చేరుతున్న సభ్యులతో కలిసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఎన్డీయేతో కలిసి పనిచేస్తాం" అని శంతను డే వెల్లడించారు
.