
ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North America)లో 28.5 మిలియన్ డాలర్లు కొల్లగొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ ఇండియన్ సినిమాగా అవతరించింది. ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైంది.
ఇక ఈ సినిమా మొదటి భాగం “ధురంధర్” గత ఏడాది డిసెంబర్ లో విడుదలై నార్త్ అమెరికాలో 20.5 మిలియన్ల సంపాదించింది. అంటే రెండు భాగాలు కలిపి ఉత్తర అమెరికాలో దాదాపు 50 మిలియన్ డాలర్లు (అక్షరాలా 490 కోట్ల రూపాయలు) ఒక్క అమెరికాలోనే కొల్లగొట్టాయి.
ఈ రెండు సినిమాలు గత ఏడు, ఎనిమిది నెలల్లోనే విడుదలై ఇంత మొత్తం సంపాదించాయి. అంటే అమెరికాలో భారతీయ సినిమాల మార్కెట్ మామూలుగా లేదు. ఈ సినిమాలకు సగటు టికెట్ ధర 10 నుంచి 12 డాలర్లు మాత్రమే. కానీ తెలుగు సినిమాలకు మాత్రం సగటు టికెట్ ధర 18 నుంచి 30 డాలర్ల వరకు ఉంటోంది.
అందుకే, తెలుగు సినిమాల మార్కెట్ అమెరికాలో ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ ఏడాది ఇప్పటికే మూడు భారీ షాకులు తగిలాయి డిస్ట్రిబ్యూటర్లకు. ఒక దాన్ని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల విడుదలైన రామ్ చరణ్ నటించిన “పెద్ది” (Peddi) సినిమా ఇప్పటివరకు 3.3 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించింది.
3.5 మిలియన్ డాలర్ల రేంజ్ లో ఈ సినిమా రన్ ముగిసిపోతుంది. అంటే ఇంకా పెద్దగా వచ్చేది లేదు. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్ భారీ మొత్తానికి కొన్నారు. 6 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధిస్తేనే లాభం, నష్టం లేని (బ్రేక్ ఈవెన్ పాయింట్) స్థితికి చేరుకుంటారు డిస్ట్రిబ్యూటర్.
అంటే “పెద్ది” వల్ల డిస్ట్రిబ్యూటర్ కి 3 మిలియన్ డాలర్లు (29 కోట్ల రూపాయలు) హాంఫట్. ధురంధర్ లాంటి సినిమాలు 20 మిలియన్ డాలర్లపైనే సులువుగా సంపాదిస్తున్నప్పుడు మన సోకాల్డ్
గ్లోబల్ స్టార్ల చిత్రాలు 3 మిలియన్ల వద్దే అపసోపాలు ఎందుకు పడుతున్నట్లు?
ఈ ఏడాది మార్చిలో విడుదలైన “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) పరిస్థితి అంతే. ఈ సినిమా మిలియన్ డాలర్లను కూడా సంపాదించలేకపోయింది. పవన్ కళ్యాణ్ పరువుని తీసేసింది ఈ చిత్రం అమెరికాలో. ఒక పెద్ద హీరో సినిమా ఒక మిలియన్ డాలర్లను కూడా రాబట్టకపోవడం అంటే ఎంత షేమ్. కొన్న డిస్ట్రిబ్యూటర్ కి వచ్చింది ఏమి లేదు.
ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ సినిమాని భారీ మొత్తానికి కొన్నారు. సినిమా 2 మిలియన్ల పై చిలుకు మొత్తం కలెక్ట్ చేసి ఆగిపోయింది. ప్రభాస్ నటించిన అంతకుముందు చిత్రం “కల్కి 2898 AD” చిత్రం 18 మిలియన్ల వసూళ్లు పొందింది. కానీ ఈ సినిమా మూడు మిలియన్ల కూడా కలెక్ట్ చెయ్యలేదు. సో, కొన్న వాళ్లకు ఎంత నష్టమో చెప్పక్కర్లేదు.
అడ్డగోలు రేట్లు చెప్పి నిర్మాతలు అమ్మేయడం ఆపాలి. హీరోలకు మీకు అంత సినిమా లేదు, మీ మార్కెట్ ఇంతే అని చెప్పే ధైర్యం నిర్మాతలకు ఉండాలి. ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోయి భారీ వసూళ్లు అని పోస్టర్లపై నెంబర్లు వేసి విడుదల చెయ్యడం, ఆ వసూళ్లు నిజమే అనుకొనే భ్రమలో హీరోలు ఉండడం, ఆ నెంబర్లకు తగ్గట్లు పారితోషికాలను 100 ప్లస్ కోట్లల్లో పారితోషికం అడగడం జరుగుతోంది. హీరోలకు అన్ని కోట్లు ఇస్తుండడంతో బడ్జెట్ భారీగా పెరుగుతోంది. దాంతో నిర్మాత ఆ మొత్తాన్ని రాబట్టేందుకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ మొత్తానికి అమ్ముతున్నారు. మార్కెట్ కి మించి డిస్ట్రిబ్యూటర్లు వెచ్చించాల్సి వస్తోంది.
అంత డబ్బు పెట్టామని డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ టికెట్ ధర పెట్టి ప్రేక్షకుల నుంచి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే, ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమాలు, బాగా టాక్ వచ్చిన సినిమాలను మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నారు. బాగుంది అన్న సినిమాకి మంచి వసూళ్లు వస్తున్నాయి. మిక్సెడ్ టాక్, సో సో అన్న దానికి అస్సలు వసూళ్లే రావడం లేదు. ఇక బాలేదు అన్న టాక్ వస్తే చిల్లర ఏరుకోవాల్సిన పరిస్థితి.
పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” సినిమాని అదే అమెరికాలో ఇరగబడి చూశారు. ఆ సినిమా దాదాపు 5.5 మిలియన్ డాలర్లు (50 కోట్లు) కొల్లగొట్టింది. ఆర్నెళ్ల తర్వాత “ఉస్తాద్ భగత్ సింగ్” విడుదలైతే అమెరికాలో $796K (7 కోట్ల రూపాయలు) మాత్రమే వచ్చాయి.
“కల్కి” సినిమాకి 18 మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తే అదే ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” సినిమా 2.3 మిలియన్ డాలర్ల వద్ద క్లోజ్ అయింది.
అట్లుంటది మన వాళ్ళతో. అందుకే, అమెరికా మార్కెట్ లో మొత్తం కరెక్షన్ రావాలి, కావాలి. నిర్మాతలు అడిగే ప్రైస్, డిస్ట్రిబ్యూటర్లు ఉంచే టికెట్ ధరలు హేతుబద్దంగా ఉండాలి.