
అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana School News: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమండ్ల సంకీస గ్రామంలో సోమవారం ఉదయం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తొలి రోజే గ్రామంలోని ఎంపీపీఎస్ (MPPS) పాఠశాల ప్రధాన గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడం కలకలం రేపింది.
పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గేటు వద్దే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలోని పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన "మన ఊరు–మన బడి" కార్యక్రమం కింద రెండేళ్ల క్రితం అభివృద్ధి పనులు చేపట్టారు.
ఈ పనులకు సుమారు రూ.40 లక్షల విలువైన టెండర్ను కాంట్రాక్టర్ రామనాథం దక్కించుకుని, కొత్త తరగతి గదుల నిర్మాణం, పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి పనులను పూర్తి చేశారు. అయితే పనులు పూర్తయి చాలా కాలం గడిచినా తనకు రావాల్సిన బిల్లులు పూర్తిగా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.
మొత్తం రూ.40 లక్షలలో ఇప్పటివరకు కేవలం రూ.7 లక్షలు మాత్రమే అందాయని, ఇంకా రూ.33 లక్షలు బకాయిగా ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లుల విడుదల కోసం పలుమార్లు సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయారు. పనుల నిర్వహణ కోసం భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నానని..
ఇప్పుడు అప్పు ఇచ్చినవారు డబ్బుల కోసం ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. వడ్డీలపై వడ్డీలు పెరుగుతుండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా స్పందన లేకపోవడంతో చివరి మార్గంగా పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం
చేస్తున్నట్లు తెలిపారు.
"నా కష్టార్జిత డబ్బులు నాకు ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను పూర్తి చేశాను. కానీ నాకు రావాల్సిన బిల్లులు ఇవ్వడం లేదు. బకాయిలు చెల్లించే వరకు తాళం తీసే ప్రసక్తే లేదు" అని కాంట్రాక్టర్ రామనాథం స్పష్టం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాల ప్రారంభమైన తొలి రోజే విద్యార్థుల చదువులకు అంతరాయం ఏర్పడటంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బకాయిల అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.