
తాండూర్, జూన్ 15 : నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు మంచిర్యాల జిల్లా తాండూర్ సీఐ దేవయ్య అన్నారు. మండలంలోని రేచిని గ్రామంలో సోమవారం తాండూర్ సీఐ దేవయ్య, ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 40 బైక్లను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించారు. అలాగే అక్రమంగా బెల్ట్ షాప్లు నిర్వహిస్తున్న వారి దుకాణాలు తనిఖీ చేసి 30 బాటిల్ ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సైబర్ మోసాలు, సోషల్ మీడియా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియని లింకులు ఓపెన్ చేయకూడదన్నారు.
ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని సూచించారు. ఫేక్ కాల్స్, ఫిషింగ్ సందేశాలు, సోషల్ మీడియా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 సేవలను వినియోగించాలని తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని, గంజాయి, డ్రగ్స్ వినియోగం ఆరోగ్యానికి, సమాజానికి హానికరమని వివరించారు. యువత ఈ అలవాట్లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను పోలీసులకు వెంటనే తెలియజేయాలని కోరారు.
రైతులు నకిలీ విత్తనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ధృవీకరించిన విక్రేతల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు, వరకట్నం వంటి సామాజిక దుష్ప్రవర్తనలను నిరోధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం స్వీయరక్షణ, నేరాల నియంత్రణకు సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని తెలిపారు.
మానసిక ఒత్తిడి ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులతో మాట్లాడాలని, అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూర్, భీమిని ఎస్ఐ లు ప్రసాద్, కోటేశ్వర్, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు
.