ప్రేమ వివాహం చేసుకుందనే కారణంతో కన్న కూతుర్ని దారుణంగా హింసించిన ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగుచూసింది. అయితే, ఈ ఘటనలో అబ్బాయి వయస్సు కేవలం 17 ఏళ్లు కాగా.. అమ్మాయి వయస్సు 22 సంవత్సరాలు. వరుసకు ఇద్దరూ బంధువులే అయినప్పటికీ యువతి చేసిన పనిని జీర్ణించుకోని తల్లిదండ్రులు మెడపై కాలు పెట్టి మరీ కొట్టారు. ఈ వార్త వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. బిహార్ రాష్ట్రంలోని మాధేపూర జిల్లా శంకర్పూర్ పోలీస్ పరిధిలోని 22 ఏళ్ల పూజా కుమారి అనే యువతి, వరుసకు బంధువయ్యే 17 ఏళ్ల బాలుడితో ప్రేమాయణం కొనాసాగించింది. ఈ ఇద్దరూ నెల రోజుల కిందట ఎవ్వరికీ తెలియకుండా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ బంధువులే కావడం, పైగా ఒకే ప్రాంతంలో ఉండటంతో పెళ్లి విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి ఇంట్లో తెలిసింది. ఇద్దరూ ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారని తెలియడంతో రెండు కుటుంబాల మధ్య పెద్ద వివాదమే చెలరేగింది. దాంతో గ్రామంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. చివరికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. పంచాయితీలో గ్రామ పెద్దలు 22 ఏళ్ల పూజ కుమారి, 17 ఏళ్ల బాలుడి వివాహం రద్దు చేయాలని నిర్ణయించారు. అంతేగాకుండా ఆ బాలుడి కుటుంబంపై రూ. లక్ష జరిమానా విధించి, ఆ మొత్తాన్ని యువతి కుటుంబానికి చెల్లించాలని ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. పంచాయితీ అనంతరం యువతిని ఇంటికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు, ఆ తర్వాత దారుణంగా హింసించారు. జూన్ 8న ఈ ఘటన చోటుచేసుకోగా దాడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. యువతి తల్లి ఆమె జుట్టును పట్టుకుని ఈడ్చుతూ నేలకేసి పడేయగా.. తండ్రి కూడా యువతి మెడపై కాలు పెట్టి హింసించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు వైరల్ కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని యువతిని రక్షించి, పోలీస్ స్టేషన్కు తరలించారు. శంకర్పూర్ పోలీస్
స్టేషన్ అధికారి రాజీవ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.