
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tirumala Temple Rush: పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అనూహ్యంగా శనివారం భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ కారణంగా అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలు బారులుతీరాయి. టోల్ గేట్ వద్ద తనిఖీలకు దాదాపు అర్థ గంటకు పైగా సమయం పడుతోంది. సర్వ దర్శనంలో భక్తులకు 18 గంటల సమయం దర్శనానికి పడుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి. నిండిన అన్నీ కంపార్ట్మెంట్లు తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు 15–18 గంటల సమయం పడుతుండగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్నీ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. వారం రోజుల్లో రోజుకు 83 వేల నుంచి 93 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 7వ తేదీన ఒక్కరోజే 93,230 మంది దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ శిలాతోరణం ప్రాంతం వరకు విస్తరించిన దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా రద్దీ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తయ్యే దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులకు కూడా 6 గంటలకుపైగా నిరీక్షణ తప్పడం లేదు. రద్దీ నియంత్రణ కోసం టీటీడీ ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సిస్టమ్ను వినియోగిస్తోంది. దీంతో గతంలో 24 నుంచి 36 గంటలు పట్టిన దర్శనం సమయం అత్యంత రద్దీ సమయంలో కూడా 8 నుంచి 14 గంటలకు తగ్గిందని టీటీడీ
అధికారులు చెబుతున్నారు
భారీ విరాళం తిరుమల శ్రీవారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ విరాళాన్ని సమర్పించింది. రూ.31 లక్షలకు పైగా విలువైన అధునాతన ట్రక్కును టీటీడీకి విరాళంగా అందజేసింది. శనివారం తిరుమలలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలకు చేరుకున్న సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు నూతన వాహనాన్ని ఉంచారు. రూ.31,72,532 విలువైన ఈ ట్రక్కుకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయగా.. అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. అశోక్ లేలాండ్ సంస్థ ఇచ్చిన ట్రక్కును శ్రీవారి సేవా కార్యక్రమాలకు, లడ్డూ ప్రసాదాల రవాణాకు లేదా ఇతర అవసరాలకు వినియోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
ట్రాఫిక్ జామ్ తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, శనివారం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా ఆగిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. టోల్గేట్ నుంచి గరుడ విగ్రహం వరకు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. తనిఖీ ప్రక్రియ ఆలస్యం కావడం.. ఒకేసారి వందలాది వాహనాలు రావడంతో అలిపిరి మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.