సీనియర్ హీరో వడ్డే నవీన్ దాదాపు పదేళ్ల విరామం తర్వాత హీరోగా నటించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ్ నార్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశీ సింగ్ హీరోయిన్ గా నటించింది. వడ్డే నవీన్ స్వీయ నిర్మాణంలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద రూపొందిన ఈ చిత్రం..
జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డే నవీన్ గురించి ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
వి.వి. వినాయక్ మాట్లాడుతూ .. ''వడ్డే నవీన్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు థాంక్స్. నేను ఆయన సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశాను. నేను కో డైరెక్టర్గా చేసిన ఆఖరి చిత్రం ఆయనదే. నవీన్ సినిమాకి పని చేస్తున్న టైంలోనే నాకు ‘ఆది’ చిత్రం వచ్చింది.
ఈయన సినిమా కోసం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడే నాకు జూనియర్ ఎన్టీఆర్ తో పరిచయమైంది. నవీన్ గారి సినిమాతోనే ‘ఆది’కి నాంది పలికినట్టు అయింది'' అని చెప్పారు. ''నవీన్ గారు నన్నెంతో ఇష్టంగా, ప్రేమగా చూసుకునేవారు. ఆయన కెరీర్లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా ఇష్టంతో చేయలేదు.
నేను ఆయన మనసులోకి దూరి చెప్పగలను. సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు. నేను ఒక సీన్ రాస్తే, ఆయన నన్ను భోజనానికి పిలిచి ఎప్పటికైనా పెద్ద డైరక్టర్ అవుతావని అన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేయడం మానేసి, డైరెక్టర్ గా ట్రై చెయ్యి, నీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే మన ఆఫీస్ కి వచ్చి కూర్చో అని చెప్పారు.
ఎందుకో నన్ను చాలా ఇష్టంగా చూసేవారు''''ఓ సందర్భంలో నవీన్ గారి పరపతి చూసి షాక్ అయ్యాను. స్విట్జర్లాండ్ లో షూటింగ్ పూర్తి చేసుకొని వస్తుండగా, ఓ కాస్ట్యూమర్
ఫ్లైట్ బాత్ రూమ్ లో సిగరెట్ కాల్చాడు. చెన్నైలో ఫ్లైట్ ల్యాండ్ అవగానే పోలీసులు ఏకే-47 గన్స్ తో వచ్చి కాస్ట్యూమర్ ని అరెస్ట్ చేశారు. నవీన్ గారు జస్ట్ ఒక్క కాల్ మాట్లాడి అతన్ని విడిపించారు. ఈయన ఇంత ఇన్ఫ్లుయెన్సరా అని అప్పుడు అనుకున్నాను. కానీ ఆయన వెళ్లాల్సిన స్థాయికి వెళ్లారని నేను అనుకోను. ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన సినిమాలే చేయాలని కోరుకుంటున్నాను. ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’' అని వీవీ వినాయక్ అన్నారు.ఇక ఈ సందర్భంగా వడ్డే నవీన్ మాట్లాడుతూ.. ''వినయ్ అప్పుడూ, ఇప్పుడూ వినయంగానే ఉన్నారు. ఆయన జర్నీ నాకెంతో గర్వంగా అనిపిస్తుంది. మా కోసం వచ్చిన వినయ్కి థాంక్స్. సినిమా కోసం టీం అంతా ఇష్టపడి చేశారు. ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ సినిమాలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది. ఏ ఫ్రైడే అయినా కూడా సింగిల్గా సినిమా రాలేదు. ఒకరితో పోటీ అని కాదు.. సినిమా బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు. ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం. ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని అన్నారు.