మియాజాకి మామిడి పండ్ల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా. జపాన్కు చెందిన అరుదైన మామిడి పళ్ల రకమే ఈ మియాజాకి. అయితే ఈ మియాజాకి మామిడి పండ్లు.. ఎక్కడ పడితే అక్కడ పండవు. వాటికి అనువైన వాతావరణ పరిస్థితులు
ఉంటేనే ఈ మొక్కలు ఎదిగి.. పండ్లను ఇస్తాయి. కానీ గత కొన్నేళ్లుగా.. తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది.. ఈ మియాజాకి మామిడి మొక్కలను తీసుకువచ్చి.. వాటిని నాటి.. పండ్లను కోస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. 4 సంవత్సరాల క్రితం మియాజాకి మామిడి పండ్ల చెట్లను నాటిన ఓ మహిళా కార్యకర్త.. తాజాగా వాటి నుంచి పండ్లను కోశారు. ఆదిలాబాద్ జిల్లా ఎచ్చోడ మండలం ముఖ్రా (కె) గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గడ్గే మీనాక్షి.. 4 ఏళ్ల క్రితం పెట్టిన అరుదైన మియాజాకి మామిడి పంటను తాజాగా విజయవంతంగా కోశారు. 2022లో కేటీఆర్ బర్త్డే సందర్భంగా నాటిన 5 మియాజాకి మొక్కల నుంచి ఇప్పుడు పండ్లు వచ్చాయి. కేరళ నుంచి తెప్పించిన ఈ మియాజాకి మామిడి మొక్కలు చల్లటి వాతావరణాన్ని ఇష్టపడినా ఆదిలాబాద్లోనూ విజయవంతంగా పెరిగాయి. ఈ మియాజాకి మామిడికి అంతర్జాతీయ మార్కెట్లో కిలోకు రూ.2.50 లక్షల వరకు ధర ఉంటుందని చెబుతున్నారు.ఈ క్రమంలోనే మియాజాకి మామిడి పండ్లను కోసినట్లు గడ్గే మీనాక్షి శుక్రవారం రోజున ఒక ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా తమ గ్రామంలోని ఖాళీ స్థలంలో 500 మామిడి మొక్కలతో పాటు 5 మియాజాకి మామిడి మొక్కలను కూడా నాటినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ మొక్కలు పెరిగి పండ్లను ఇచ్చాయని.. వాటిని కోయడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు.ఈ మియాజాకి మొక్కలను కేరళ నుంచి ప్రత్యేకంగా తెప్పించి సాగు చేసినట్లు మీనాక్షి తెలిపారు. సాధారణంగా ఈ మియాజాకి మామిడి చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతుందని.. ఆదిలాబాద్ ప్రాంతంలో అవి పెరుగుతాయా లేదా అనే సందేహం తనకు మొదట్లో ఉండేదని.. అయితే సరైన సంరక్షణతో మొక్కలు పెరిగి ఫలాలు ఇవ్వడం సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు.