
Sajjala Ramakrishna Reddy: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల
విజయవంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా బయటపడిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే హింసాత్మక రాజకీయాలకు పాల్పడిందని సజ్జల ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో లభించిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని, చెప్పుకోదగ్గ పాలన అందించడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదర్శవంతమైన పాలన సాగిందని సజ్జల పేర్కొన్నారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పిన ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పటికే అమలులో ఉన్న అనేక పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. గత రెండేళ్లలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, జగన్ పాలన విలువ ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం చట్టాలను తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫేక్ ప్రచారాలు నిర్వహిస్తూ ప్రత్యర్థులపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోందని సజ్జల ఆరోపించారు. ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రజలకు చూపించగలిగే అభివృద్ధి ఏదీ లేదని విమర్శించారు.
వైసీపీ ఈ రెండేళ్లుగా “వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్”గా పనిచేస్తూ బాధితుల తరఫున పోరాటం చేస్తోందని సజ్జల తెలిపారు. సంక్షేమ పథకాలపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, గత ప్రభుత్వ హయాంలో అమలైన అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైసీపీ విజయం సాధించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని సజ్జల పేర్కొన్నారు. అధికార పార్టీ, పోలీసులు పలుచోట్ల కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రజలు ముందుకు వచ్చారని ఆరోపించారు. ప్రజల ఆగ్రహాన్ని అణచివేయడం సాధ్యం కాదని ఈ నిరసనలు నిరూపించాయని అన్నారు.
మంత్రి నారా లోకేష్పై కూడా సజ్జల విమర్శలు గుప్పించారు. అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటూ తన సొంత శాఖపై దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ వ్యవహారంలో స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై స్పందిస్తూ, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన ప్రస్తుతం ఆ పాత్రను నిర్వర్తించడం లేదని విమర్శించారు. మరోవైపు, మాజీ సీఎం జగన్పై వ్యక్తిత్వ హననం చేయడమే ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఇంధన ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదని సజ్జల అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాలు, రావాల్సిన బకాయిలపై ప్రజలు నిలదీయాలని సూచించారు. ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా వైసీపీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.