
Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య విభేదాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో పాటు
ఆయన కుటుంబ సభ్యులు, వ్యాపార భాగస్వాములపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)కు లేఖ రాశారు. తన ఫిర్యాదులో ఎంపీ చిన్ని, ఆయన భార్య జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజ్ కేసిరెడ్డి సహా వారి నెట్వర్క్కు సంబంధించిన పలు అంశాలపై విచారణ జరపాలని నాని కోరారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో రాజ్ కేసిరెడ్డి అరెస్టు, జానకి లక్ష్మికి జారీ చేసిన సమన్లు నేపథ్యంలో దర్యాప్తును ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆయన ఆరోపించారు.
టికెట్ల కేటాయింపులో అవినీతి జరిగిందని, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను కూడా దర్యాప్తులో భాగం చేయాలని నాని కోరారు. టికెట్ కోసం రూ.5 కోట్ల వరకు డిమాండ్ చేశారనే ఆరోపణలతో పాటు, సుంకర రామచంద్రరావు మరియు బొల్లినేని మోహన్రావు ఖాతాలకు జరిగిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కేశినేని డెవలపర్స్ చేపట్టిన దుండిగల్, కర్తానూర్-పటాంచేరువు, గచ్చిబౌలి, బంజారాహిల్స్, శంకరపల్లి ప్రాంతాల ప్రాజెక్టుల్లో ప్రీ-లాంచ్ దశలోనే భారీ మొత్తాలు వసూలు చేసి కొనుగోలుదారులను మోసం చేశారంటూ నాని ఆరోపించారు. అలాగే సహితి ఇన్ఫ్రా స్కామ్తో సంబంధాలపై కూడా దర్యాప్తు జరపాలని కోరారు.
112 ఎకరాల ప్రగతి నగర్ భూమి వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, ఎంపీ కుమారుడు వెంకట్ చౌదరి అనుబంధంగా ఉన్న ఎక్సెల్లా ప్రాపర్టీస్ సంస్థ భూములు ఇప్పటికే ఈడీ అటాచ్మెంట్, ఎన్సీఎల్టీ, పీఎంసీ బ్యాంక్ కేసుల పరిధిలో ఉన్నప్పటికీ ప్రీ-లాంచ్ విక్రయాలు కొనసాగించిందని ఆరోపించారు కేశినేని నాని... ఈ భూములకు సంబంధించిన వివాదాల విషయంలో సుప్రీంకోర్టును కూడా తప్పుదారి పట్టించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇసుక, గ్రావెల్, ఫ్లైయాష్ గనులు, ల్యాండ్ గ్రాబింగ్, జూద కార్యకలాపాల వంటి అంశాల్లో కూడా ఎంపీ నెట్వర్క్ ప్రమేయం ఉందని నాని ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)లో అవినీతి జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్యే కూన రవి చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఆ వ్యవహారంపై కూడా సమగ్ర విచారణ జరపాలని కోరారు.
2025 విజయవాడ ఉత్సవాల నిర్వహణలో భారీగా నిధులు వసూలు చేశారనే ఆరోపణలను కూడా నాని తన లేఖలో ప్రస్తావించారు. అలాగే ఎంపీ చిన్ని, గుడివాడ ఎమ్మెల్యే రాము అనుబంధంగా ఉన్నట్లు చెబుతున్న అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని సంస్థలు విద్యార్థులు, వలసదారులను మోసం చేస్తున్నాయనే ఆరోపణలపై కూడా విచారణ జరపాలని ఈడీని అభ్యర్థించారు. కేశినేని నాని చేసిన ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎంపీ కేశినేని చిన్ని లేదా సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈడీ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.