
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వలలు విసురుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత అవగాహన పెరిగినా
Jun 12 2026 10:16 AM | Updated on Jun 12 2026 10:27 AM
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరుతో వలలు విసురుతూ సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఎంత అవగాహన పెరిగినా.. ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నవారైనా ఇలాంటి మోసాలకు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ డేటింగ్ యాప్లో మొదలైన పరిచయం.. సంచలన కేసుగా మారింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ హనీట్రాప్ తరహా మోసంలో చిక్కుకున్నది సామాన్య వ్యక్తి కాదు.. ఓ మహిళా జడ్జి.
హర్యానాలో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు న్యాయ వర్గాల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఓ మహిళా జడ్జి ఇంట్లో పని మనిషి తాను డేటింగ్ యాప్లో మోసపోయానని పోలీసులను ఆశ్రయించింది. జడ్జి రిఫరెన్స్ కావడంతో ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ కేసు కోర్టుకు చేరిన తర్వాత అసలు కథ బయటపడింది. టిండర్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో రూ.52 లక్షలకు పైగా మోసపోయింది పనిమనిషి కాదు.. సదరు మహిళా న్యాయమూర్తి అని తేలింది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. గత ఏడాది నవంబర్లో టిండర్ యాప్లో "అభిమన్యు వశిష్ఠ్" పేరుతో ఓ వ్యక్తి మహిళా జడ్జికి పరిచయమయ్యాడు. తాను కేంద్ర ప్రభుత్వంలోని ఓ రహస్య విభాగంలో పనిచేస్తున్నానని చెప్పి ఆమె నమ్మకం సంపాదించాడు. క్రమంగా ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికాడు.
అతని మాటలు నమ్మిన జడ్జి.. వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.52 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే చెప్పినట్టుగా లాభాలు రాకపోవడం, అతని ప్రవర్తనపై అనుమానాలు రావడంతో తాను మోసపోయినట్లు గుర్తించారు.
అయితే ఈ కేసులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఫిర్యాదు నమోదైన తీరు. అసలు డబ్బు జడ్జి ఖాతాల నుంచి వెళ్లినా.. ఫిర్యాదు మాత్రం ఆమె ఇంటి పనిమనిషి పేరుతో నమోదైంది. దీంతో విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అసలు బాధితురాలు ఎవరో స్పష్టంగా పేర్కొనకుండా కేసు నమోదు కావడంపై ప్రశ్నలు లేవనెత్తింది.
బెయిల్ పిటిషన్ను విచారించిన అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలేర్.. రొమాన్స్ లేదా హనీట్రాప్ తరహా మోసాల బాధితులు ఇబ్బందిగా భావించడం సహజమేనని, కానీ అందుకోసం దర్యాప్తు పారదర్శకతను పక్కనపెట్టలేమని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని కోర్టు గుర్తించింది. టిండర్ చాట్లు, పూర్తి వాట్సాప్ సంభాషణలు, కాల్ డీటెయిల్ రికార్డులు వంటి కీలక ఆధారాలు ఇంకా సేకరించలేదని పేర్కొంది. నిందితుడు కూడా తన మొబైల్ను పూర్తిగా పరిశీలనకు ఇవ్వకుండా, తనకు అనుకూలమైన కొన్ని సందేశాలు మాత్రమే సమర్పించాడని కోర్టు వ్యాఖ్యానించింది.
దీంతో నిందితుడి ప్రవర్తనను "దాగుడుమూతల ఆట"గా అభివర్ణించిన కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. టిండర్, వాట్సాప్ రికార్డులను పూర్తిగా సేకరించాలని, డబ్బు బదిలీల వెనుక ఉన్న ఖాతాలు, సంస్థలను పరిశీలించాలని, నిందితుడి ఫోన్పై ఫోరెన్సిక్ విశ్లేషణను వేగవంతం చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించింది.
డేటింగ్ యాప్లో మొదలైన ఈ పరిచయం.. ప్రేమ, పెట్టుబడులు, నమ్మకం పేరుతో సాగి.. చివరకు రూ.52 లక్షల మోసం, ఫిర్యాదు చుట్టూ కొత్త ప్రశ్నలు, కోర్టు వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.
‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
ఫుట్బాల్ జాతర షురూ.. అట్టహాసంగా ఫిఫా ఆరంభ వేడుకలు (ఫొటోలు)
తిరుమల శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ (ఫొటోలు)
'రాను బొంబాయికి రాను లిఖిత 'సాV3' మూవీ టీజర్ విడుదల (ఫొటోలు)
యుద్ధంపై ట్రంప్ యూటర్న్.. చర్చలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్!
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. కేతిరెడ్డి పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
మెరైన్ ఇంజనీర్ సురేష్ మృతిపై YS జగన్ దిగ్భ్రాంతి