మహమ్మద్ సిరాజ్ .. పరిచయం అక్కర్లేని పేరు. హైదరాబాద్ గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఈ పేసర్.. ఇప్పుడు టీమిండియాకు కీలకంగా మారాడు. ఒకప్పుడు బుమ్రాకు సపోర్టింగ్ రూల్లో మాత్రమే కనిపించిన ఇతడు
.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకత సంపాదించాడు. టీమిండియా ప్రధాన పేసర్గా మారిపోయాడు. వైట్-బాల్ క్రికెట్లో ఎక్కువగా అవకాశాలు అందుకోలేకపోతున్న ఈ పేసర్.. టెస్టుల్లో మాత్రం సత్తాచాటుతున్నాడు. అంతేకాకుండా ఫిట్నెస్ విషయంలో ఎవరికీ అందనంతగా.. విరామం లేకుండా మ్యాచులు ఆడుతూ.. ఆదర్శనంగా నిలిస్తున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనే పదం తన డిక్షనరీలోనే లేదు అన్నట్లుగా దూసుకెళ్తున్నాడు. దీంతో ప్రపంచ క్రికెట్లోనే అత్యంత బిజీగా ఉండే ఫాస్ట్ బౌలర్గా మారిపోయాడు.గతంలో భారత బౌలర్లకు వరుసగా క్రికెట్ మ్యాచులు ఆడేవారు. ఆప్షన్లు తక్కువగా ఉండటంతో కపిల్ దేవ్ లాంటి ప్లేయర్ విరామం లేకుండా మ్యాచ్లు ఆడేవాడు. ఆ తర్వాత జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ కూడా ఇలాంటి క్రికెటే ఆడారు. కానీ బుమ్రా రాకతో పరిస్థితి మారిపోయింది. అతడి ప్రదర్శన దృష్ట్యా.. బీసీసీఐ అతడిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. పనిభారం దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతడిని మ్యాచ్లు ఆడిస్తూ వస్తోంది. దీంతో బుమ్రా గైర్హాజరీలో పేస్ దళాన్ని నడిపించే వ్యక్తి జట్టుకు అవసరమయ్యాడు. అలాంటి సమయంలో నేనున్నా అంటూ ముందుకొచ్చాడు సిరాజ్. అప్పటి నుంచి బిజీగా మారిపోయాడు.2023 జనవరి నుంచి సిరాజ్ టెస్టులు, వన్డేలు, టీ20లు, ఐపీఎల్లో కలిపి 1,231 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఈ వ్యవధిలో ఇన్ని ఓవర్లు వేసిన ఏకైక ఫాస్ట్ బౌలర్ అతడే. ముఖ్యంగా సిరాజ్ టెస్టుల్లో కీలక పేసర్గా మారిపోయాడు. ఏకంగా 30 మ్యాచ్లలో 744 ఓవర్లు వేశాడు. అంటే దాదాపు ప్రతి టెస్టులో 25 ఓవర్లు వేశాడన్నమాట. మరో మాటలో చెప్పాలంటే, ఫాస్ట్ బౌలర్లపై అత్యధిక శారీరక శ్రమను పెట్టే ఫార్మాట్లోనే సిరాజ్ మొత్తం పనిభారంలో 60 శాతం ఉంది. అందుకే వైట్ బాల్ క్రికెట్లో సిరాజ్ అవసరం లేదనిపిస్తున్నా.. రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తప్పనిసరిగా ఎంపిక చేయాల్సిన పరిస్థితి కల్పించాడు.2023 నుంచి భారత్ 33 టెస్టులు ఆడగా, సిరాజ్ వాటిలో 30 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఇదే సమయంలో బుమ్రా.. కేవలం మూడింట రెండు వంతుల టెస్టులు ఆడాడు. 2025లో భారత్ ఇంగ్లాండ్లో పర్యటించినప్పుడు, సిరాజ్ ఐదు టెస్టుల్లోనూ ఆడిన ఏకైక భారత సీమర్గా నిలిచాడు. 185 ఓవర్లు బౌలింగ్ చేసి జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.ముందున్న కఠిన సీజన్, వన్డే ప్రపంచకప్, టెస్టుల్లో సిరాజ్ అవసరాన్ని గుర్తించే సెలక్టర్లు ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20ల నుంచి సిరాజ్కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో భారత్ 17 వన్డేలు, 10 టెస్టులు ఆడాల్సి ఉంది. వన్డే ప్రపంచకప్ 2027 దృష్ట్యా.. బీసీసీఐ బుమ్రాతో పాటు.. సిరాజ్ పనిభారాన్ని కూడా ఇకపై పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సిరాజ్ ఫిట్గా ఉన్నాడు, పనిభారం అనే పదం అతడికి అవసరం లేదు. కానీ సిరాజ్ మ్యాచ్ ఆడని పరిస్థితి తలెత్తకూడదనే ఉద్దేశంలో సెలక్టర్లు ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు!