
ఇంటర్నెట్ డెస్క్: సీబీఎస్ఈ ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (CBSE OSM) మూల్యాంకన ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ లోపాలను బయటపెట్టిన యువతలో 19
ఏళ్ల నిసర్గ అధికారి కూడా ఒకరు. తాజాగా అతడిని ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) నియమించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తమ సైబర్ డిఫెన్స్ రీసెర్చ్ సెంటర్ C3iHubలో నిసర్గ అధికారిని ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్గా నియమిస్తున్నట్లు ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. దీనిపై ఈ విద్యాసంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘నిసర్గ అధికారి ఎంతో నైపుణ్యం ఉన్న యువ ఇంజినీర్. అతడికి చిన్న వయసులోనే అద్భుతమైన సాంకేతిక సామర్థ్యాలున్నాయి. ఈ నియామకంతో సైబర్ సెక్యూరిటీ రంగంలో అతడికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. దీంతోపాటు మా విభాగం కూడా బలోపేతం అవుతుందని భావిస్తున్నాం. గతంలోనూ మా సైబర్ విభాగంలో ఇలా యువ ఇంజినీర్లను నియమించుకున్నాం’’ అని వెల్లడించారు. కాంట్రాక్టు విధానంలో అతడిని ఐఐటీ కాన్పూర్ నియమించుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. అయితే, అతడి వేతనం, ఇతర వివరాలను విద్యాసంస్థ వెల్లడించలేదు.
నిసర్గ అధికారి ఈ ఏడాదే 12వ తరగతి పూర్తిచేశాడు. అతడి కుటుంబంలో ఎవరూ సైబర్ సెక్యూరిటీ రంగంలో లేరు. తల్లిదండ్రులిద్దరూ ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నారు. కోడింగ్ మీదున్న ఆసక్తితో ఆరేళ్ల వయసు నుంచే దాన్ని నేర్చుకోవడం మొదలుపెట్టాడు. ఆరోతరగతికి వచ్చాక.. సైబర్ సెక్యూరిటీపై దృష్టిపెట్టాడు. ‘క్యాప్చర్ ది ఫ్లాగ్’ వంటి హ్యాకింగ్ పోటీల్లో పాల్గొని పలు బహుమతులు గెలుచుకున్నాడు. ఇటీవల సీబీఎస్ఈలోని ఆన్ స్క్రీన్ మార్కింగ్ పోర్టల్లో లోపాలను గుర్తించిన నిసర్గ.. ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ సెక్యూరిటీ విభాగం సెర్ట్-ఇన్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో అతడి పేరు జాతీయ మీడియాలో మార్మోగింది. తాజా నియామకంపై నిసర్గ మాట్లాడుతూ.. ‘‘ఫుల్టైమ్ సైబర్ సెక్యూరిటీ విభాగంలో పనిచేయడం ఆనందంగా ఉంది. అయితే, వేతనం నేను అనుకున్న దానికంటే తక్కువగానే ఉంది’’ అని పేర్కొన్నాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
భారతీయ విమానయాన, రక్షణ రంగాల్లో సరికొత్త మైలురాయి నమోదైంది.