ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న మరో వాణిజ్య నౌక దాడికి గురైంది. ఒమన్లోని షినాస్ పోర్టు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని ఒమన్లోని భారత రాయబార
కార్యాలయం ధృవీకరించింది. ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.ప్రాథమిక సమాచారం ప్రకారం గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ‘జలవీర్’ ట్యాంకర్లో భారతీయ సిబ్బంది ఉన్నారు. దానిపై దాడి జరిగినప్పటికీ అందులోని సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.వారం రోజుల్లో భారతీయ సిబ్బందితో ఉన్న నౌకలపై దాడి జరగడం ఇది మూడోసారి. నిన్నే ‘సెట్టెబెల్లో’ అనే ట్యాంకర్పై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంట్లోనే ఉన్న మరో 21 మందిని కాపాడారు. అంతకుముందు ‘మారివెక్స్’ అనే ట్యాంకర్పై కూడా కాల్పులు జరిగాయి. ఆ నౌకలో ఉన్న 24 మంది భారతీయులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా సైనిక హెలికాప్టర్ను కూల్చివేయడంతో అమెరికా బలగాలు ప్రతీకార దాడులు చేపట్టాయి. దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో ఎదురుదాడులు చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత క్లిష్టంగా మారాయి.భారత సిబ్బందితో ఉన్న నౌకలపై దాడులను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ జలమార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలకు భంగం కలగకూడదని స్పష్టం చేసింది. ఉద్రిక్తతలను తగ్గించి, దౌత్యపరమైన పరిష్కారం దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది.