మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం
అంగీకరించింది. అయితే ఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేసేలా ఆదేశాలివ్వాలన్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.మీనాక్షి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని సుప్రీం కోర్టును కోరారు. తెలంగాణలోని ఓ ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించి ఆమెకు కేవలం నోటీసు మాత్రమే జారీ అయిందని వివరించారు. ఆ వ్యవహారంలో కోర్టు ఇంకా కేసును విచారణకు స్వీకరించలేదని, ఛార్జిషీట్ కూడా నమోదు కాలేదని తెలిపారు.దీన్ని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని కాంగ్రెస్ వాదిస్తోంది. అందువల్ల నామినేషన్ పత్రాల్లో ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా ఆ దశలో సమాచారాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదని కోర్టు దృష్టికి సింఘ్వీ తీసుకెళ్లారు.