ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల
నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా , పోలవరం, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 42 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. కొన్ని చోట్ల 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.మరోవైపు విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచి పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తూర్పుగోదావరి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. విజయనగరం, గజపతినగరం, అరకు, ఎస్. కోట, కొత్తవలస, నర్నీపట్నం, చోడవరం, మాడుగుల మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ తెలిపింది. గంటకు 50 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది . వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. భారీ వర్షాలు కురిసే సమయంలో కల్వర్టులు, కాలువలకు సమీపంలోకి వెళ్లవద్దని సూచించింది. అలాగే వడగాలులు వీచే ప్రాంతాల్లోనూ అప్రమత్తంగా ఉండాలని.. డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.