పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్లో టీఎంసీని విలీనం చేసే దిశగా అడుగులు
పడుతున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ , ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీలు.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు రాజకీయ వర్గాల్లో ఎత్తున చర్చకు దారితీసింది.ప్రతిపక్ష ఇండియా కూటమిలో సమన్వయాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బుధవారం కాంగ్రెస్ అగ్రనేత నేత రాహుల్ గాంధీతో గంటన్నర పాటు సమావేశమయ్యారు. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తాము బలమైన కూటమిని కోరుకుంటున్నామని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నామని ఈ సమావేశంలో తృణమూల్ తెలియజేసింది. విలీనానికి సంబంధించిన ఏ ప్రతిపాదన అయినా తృణమూల్ నుంచే రావాలని, తాము అలాంటి చర్య కోసం ఒత్తిడి చేయడం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీనికి ముందు మంగళవారం మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీలు సమావేశమయ్యారు. ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ, సోనియా గాంధీల ఆలింగనానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దీనిని తృణమూల్ పార్టీ వారి మధ్య ఉన్న దీర్ఘకాల అనుబంధానికి సంకేతంగా అభివర్ణించింది. సోమవారం జరిగిన ఇండియా కూటమి సమావేశం అనంతరం ఇరు పార్టీల మధ్య నిరంతరం సాగుతున్న చర్చల్లో భాగంగానే బుధవారం రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీల మధ్య ఈ భేటీ జరిగింది. బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాల మధ్య మరింత సమన్వయం, ఐక్యత అవసరమని విపక్ష నాయకులు నొక్కి చెప్పారు.మరోవైపు, బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాంకర్ సర్కార్ విలీనానికి తలుపులు తెరిచే ఉంచామని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ‘రాజకీయాలు అంటేనే సాధ్యసాధ్యాల కళ... కాబట్టి రేపు ఏదైనా జరగవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ‘‘ఆర్ఎస్ఎస్ సిద్ధాంతానికి, బీజేపీ నియంతృత్వానికి వ్యతిరేకంగా మా నాయకుడు రాహుల్ గాంధీ అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.. ఈ విషయంలో ఎక్కడా రాజీపడలేదు.. ఆయన ఎంతో అణచివేతకు గురయ్యారు. రాహుల్ గాంధీ సమాజంలోని వెనుకబడిన వర్గాలకు, కష్టాల్లో ఉన్న ప్రజలకు గొంతుకగా మారాలని మేము కోరుకుంటున్నాం... ఆయనే ప్రధాని కావాలి.. ఈ విషయాన్ని అంగీకరించే ఎవరికైనా మా తలుపులు తెరిచే ఉంటాయి... అంత ధైర్యం లేని వారు కాంగ్రెస్లో చేరలేరు.. తప్పులు చేసినవారే తమ తప్పులు కడుక్కోవడానికి వాషింగ్ మెషిన్ కోసం వెతుక్కుంటారు’’ అని సర్కార్ అన్నారు.కాగా, టీఎంసీ, కాంగ్రెస్లకు ఉమ్మడి చరిత్ర ఉంది. మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి 1998లో తృణమూల్ కాంగ్రెస్ను స్థాపించారు. 2011లో పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కాంగ్రెస్, టీఎంసీ కలిసి పనిచేశాయి, కానీ మరుసటి ఏడాదే వారి పొత్తు విచ్ఛిన్నమైంది. ఆ తర్వాత, 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలో భాగస్వాములయ్యారు. సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమైన తర్వాత ఈ పార్టీల మధ్య సంబంధాలు మరింత బలపడతాయనే ఊహాగానాలు మొదలయ్యాయి.ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత పలువురు ఎంపీలు పార్టీ నుంచి విడిపోయి బీజేపీ, ఎన్డీఏలతో పొత్తు పెట్టుకుంటామని సంకేతాలు ఇచ్చారు.