ఓ హిందూ యువకుడు మతం మారి.. ముస్లిం మహిళను వివాహం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఉత్తర్ ప్రదేశ్లోని షామ్లీకి చెందిన ప్రముఖ ఫార్మాస్యూటికల్ దేవరాజ్ మాలిక్ కుమారుడు 30 ఏళ్ల ఆయుష్ ఇస్లాం
స్వీకరించాడు. ఈద్ పండుగ రోజున అతడు నమాజ్ చేస్తున్న ఫోటోలు విస్తృతంగా ప్రచారం కావడంతో హిందూ సంఘాల దృష్టికి వచ్చింది. దీంతో మత మార్పిడి నిరోధక చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు.. ఆ యువకుడి భార్య, ఆమె తండ్రిని అరెస్టు చేశారు. మతం మారిన తర్వాత మహమ్మద్ అలీగా పేరు మార్చుకున్న ఆయుష్ మాలిక్ .. ఇందులో ఎవరి బలవంతం లేదని, తాను స్వచ్ఛందగానే ఇస్లాంను స్వీకరించానని చెప్పడం ఇక్కడ ట్విస్ట్. అంతేకాదు, తన భార్య కోసం న్యాయ పోరాటం చేస్తానని అతడు వెల్లడించారు.షామ్లీ ఎస్పీ ఎన్పీ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ప్రాథమిక విచారణలో ఆయుష్ మాలిక్కు తన భార్య చాందిన ఖురేషితో ఆమె సోదరుడు ఆస్ మహమ్మద్ ద్వారా పరిచయం ఏర్పడినట్టు తేలింది.. మాలిక్ కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్లో ఆమె సోదరుడు పనిచేసేవాడు.. కానీ, తమ కుటుంబ ఆస్తులను కాజేయాలనే ఉద్దేశంతో ఆయుష్ను వలలో వేసి మతం మార్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు’’ అని చెప్పారు. ఈ వ్యవహారంపై చాందినితో పాటు మరో 8 మందిపై కేసు నమోదయినట్టు తెలిపారు.ప్రముఖ వ్యాపారవేత్త షామ్లీ మెడిసిన్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిన దేవరాజ్ మాలిక్ మాట్లాడుతూ‘‘నా కొడుకు వ్యవహారం, మత మార్పిడి గురించి నాకు తెలుసు. అతడిని వెనక్కి రప్పించే విషయాన్ని రహస్యంగానే చూసుకుంటున్నాను. కానీ ఆ ఫోటోలు హిందూ సంస్థల దృష్టికి రావడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది’’ అని అన్నారు.ఆయుష్ మాత్రం ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచే ఇస్లాం అంటే ఇష్టం.. 2012 నాటికి నా విశ్వాసం బలపడింది. సుమారు నాలుగేళ్ల క్రితం నేను మతం మారాను.. అదే సమయంలో చాందినిని వివాహం చేసుకున్నాను. అప్పటి పరిస్థితుల కారణంగా నేను ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి, ఫిబ్రవరిలో మా తల్లిదండ్రులకు తెలియజేశాను. నేను, నా భార్య మేజర్లం... చట్టపరంగా, మేము చేసిన దానికి మాకు పూర్తి హక్కులు ఉన్నాయి. నేను ఆమె కోసం పోరాడతాను’’ అని తేల్చిచెప్పాడు.అయితే, దీని వెనుక పాకిస్థాన్కు ఉన్న సంబంధాన్ని కూడా పోలీసులు గుర్తించారని సింగ్ పేర్కొన్నారు. ‘‘విచారణలో తాను పాకిస్థాన్కు చెందిన దివంగత బోధకుడు ఇస్రార్ అహ్మద్ బోధనలకు తీవ్రంగా ప్రభావితమైనట్టు ఆయుష్ అంగీకరించాడు’’ అని ఆ అధికారి తెలిపారు. గతంలో ఫిజియోథెరపిస్ట్గా పనిచేసిన చాందిని.. తర్వాత ఆయుష్ జిమ్లో ట్రెయినర్గా చేరినట్టు పోలీసులు తెలిపారు. పరిచయం ప్రేమగా మారడంతో రెండేళ్లు సహజీవనం చేశారు. అనంతరం ఆమె కుటుంబం అనుమతితో ఢిల్లీలోని మసీదులో పెళ్లి చేసుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు.. యూపీ మతమార్పిడి నిరోధక చట్టం, బీఎన్ఎస్ చట్టంలో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.