
భారతీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి మిక్స్డ్గా స్థిరపడ్డాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ముగియగా.. నిఫ్టీ నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ ఆరంభంలో లాభాలు కనిపించినప్పటికీ
ద్వితీయార్థంలో మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, స్థిరాస్తి రంగాల షేర్లలో భారీగా లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో మార్కెట్లు గరిష్ఠ స్థాయుల నుంచి వెనక్కి తగ్గాయి. చివరకు సెన్సెక్స్ 64.42 పాయింట్లు లాభపడి 73,983.18 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 27.15 పాయింట్లు నష్టపోయి 23,214.95 వద్ద ముగిసింది. నిఫ్టీ షేర్లలో హిందాల్కో ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మీడియా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంక్, నిఫ్టీ రియల్టీ రంగాలు నష్టాలు మూటగట్టుకున్నాయి. దీనితో పాటు మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ షేర్లపై విక్రయాల ఒత్తిడి కనిపించింది. నిఫ్టీ మిడ్-క్యాప్ సూచీ 1.49 శాతం, నిఫ్టీ స్మాల్-క్యాప్ సూచీ 1.33 శాతం చొప్పున పతనమై ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి.కొన్ని దిగ్గజ షేర్లు భారీ నష్టాల నుంచి మార్కెట్లను గట్టెక్కించాయి. సెన్సెక్స్లో హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభాల బాట పట్టి సూచీని గ్రీన్ జోన్లో నిలబెట్టాయి. ముఖ్యంగా నిఫ్టీ ఎఫ్ఎమ్సీజీ సూచీ ఒక శాతానికి పైగా లాభపడగా ప్రైవేట్ బ్యాంకులు, కెమికల్ రంగాలు కూడా రాణించాయి.