
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) లను పూర్తి స్థాయి స్క్రూటినీకి ఎంపిక చేసేందుకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రధానంగా
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR) లను పూర్తి స్థాయి స్క్రూటినీకి ఎంపిక చేసేందుకు తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నిబంధనలు ప్రధానంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన రిటర్న్‌లకు వర్తిస్తాయి. ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఎందుకు, ఎలా క్షుణ్ణంగా పరిశీలిస్తుందో తెలిపే సమగ్ర నిబంధనలను ఈ మార్గదర్శకాలు నిర్దేశించాయి. తాజా సర్క్యులర్ ప్రకారం, ఆదాయపు పన్ను శాఖ గుర్తించిన కొన్ని నిర్దిష్ట ప్రమాణాల ఆధారంగా, పన్ను చెల్లింపుదారుల రిటర్న్‌లు తప్పనిసరిగా పూర్తి స్థాయి స్క్రూటినీకి (ITR Scrutiny) ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా, పన్ను ఎగవేతలను గుర్తించేలా CBDT తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఆదాయపు పన్ను అసెస్‌మెంట్ ప్రక్రియలో పన్ను చెల్లింపుదారు సమర్పించిన వివరాలను అధికారులు క్షుణ్ణంగా సమీక్షిస్తారు. అసెస్‌మెంట్లు ప్రధానంగా రెండు రకాలు. తప్పనిసరి స్క్రూటినీ (Compulsory selection), రిస్క్ పారామీటర్ ఆధారిత స్క్రూటినీ. ప్రతి ఏటా ఆదాయపు పన్ను శాఖ దీనిపై మార్గదర్శకాలను జారీ చేస్తుంది. 2025 నాటి మార్గదర్శకాలతో పోలిస్తే, 2026లో పన్ను చెల్లింపుదారులపై గణనీయంగా ప్రభావం చూపే మార్పులేమీ లేవు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కంపల్సరీ స్క్రూటినీకి ఏ ఏ కారణాలతో రిటర్న్‌లను ఎంపిక చేస్తారో ఇప్పుడు చూద్దాం. మొదటిది CS 01 విభాగం: ఐటీ యాక్ట్ 1961లోని సెక్షన్ 133A కింద సర్వే జరిగిన కేసులు. 2024 ఏప్రిల్ 1 తర్వాత జరిగిన సర్వేలకు సంబంధించిన రిటర్న్‌లను దీని కింద పరిశీలిస్తారు. ఈ కేసులను డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ కమ్ టాక్స్ (సిస్టమ్స్) ఎంపిక చేస్తుంది. రెండవది CS 02 విభాగం: దీని కింద సెక్షన్ 132 లేదా 132A కింద సోదాలు (Search) లేదా వసూలు (Requisition) జరిగిన కేసులను స్క్రూటినీకి తీసుకుంటారు. 2024 ఏప్రిల్ 1 తర్వాత జరిగిన సోదాలకు ఇది వర్తిస్తుంది. సెక్షన్ 143(2) కింద నోటీసు జారీ చేసిన తర్వాత, ఒకవేళ అది సెంట్రల్ ఛార్జీల పరిధిలోకి రాకపోతే, 15 రోజుల్లోగా సంబంధిత విభాగానికి బదిలీ చేస్తారు.మూడవది CS 03 విభాగం: ఇది సెక్షన్ 148 కింద నోటీసులు జారీ చేసిన కేసులకు సంబంధించింది. సెక్షన్ 143(2) కింద నోటీసు జారీ చేసి, సదరు రిటర్న్‌లను పరిశీలిస్తారు. ఇందులో సెక్షన్ 148 నోటీసు పొందిన ఇతర అసెస్‌మెంట్ కేసులు కూడా ఉంటాయి. ఈ కేసులను నేషనల్ ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సెంటర్ (NaFAC) ద్వారా మరింత విచారణ కోసం సిస్టమ్స్ విభాగం పంపిస్తుంది. నాలుగవది CS 04 విభాగం: ఇది ట్రస్టులు, సంస్థలకు సంబంధించినది. సెక్షన్‌లు 12A, 12AB, 35(1)(ii), 10(23C) వంటి నిబంధనల కింద పన్ను మినహాయింపు పొందని లేదా ఆ హోదాను కోల్పోయిన సంస్థల రిటర్న్‌లను (ITR-7) ఇందుకోసం ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. అప్పీళ్ల ద్వారా క్యాన్సలేషన్ ఉత్తర్వులు రద్దయిన సందర్భాల్లో ఇది వర్తించదు.ఐదవది CS 05 విభాగం: గత అసెస్‌మెంట్ సంవత్సరాల్లో భారీగా ఆదాయపు అదనపు చేర్పులు (Additions) జరిగిన రిటర్న్ లు. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే వంటి మెట్రో నగరాల్లో అదనపు ఆదాయం రూ. 50 లక్షలు దాటినప్పుడు, ఇతర ప్రాంతాల్లో రూ. 20 లక్షలు దాటినప్పుడు ఈ స్క్రూటినీ వర్తిస్తుంది. ఇవి పన్ను విధింపులో ఇప్పటికే ఖరారైన అంశాలపై ఆధారపడి ఉంటాయి. చివరగా CS 06 విభాగం: ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం ఉన్న కేసులను అధికారులు దీని పరిధిలోకి తెస్తారు. చట్ట అమలు సంస్థలు (Law-enforcement agencies), నిఘా విభాగం లేదా ఇతర నియంత్రణ సంస్థల నుండి వచ్చే సమాచారం మేరకు పన్ను ఎగవేతను కనిపెడతారు. ఇతర సాధారణ సమాచారంతో కూడిన రిటర్న్‌లు ఈ పరిధిలోకి రావు, కేవలం పన్ను ఎగవేత లక్ష్యంగా ఉన్న కేసులు మాత్రమే ఇందులో ఉంటాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల కోసం సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ నోటీసు జారీ చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు జూన్ 30 వరకు గడువు ఉంది.