
Silver Hallmarking : వెండి ఆభరణాలు, వెండి వస్తువులకు తప్పనిసరి హాల్మార్కింగ్ అమలుపై భారత ప్రమాణాల బ్యూరో (BIS) అధ్యయనం చేస్తోంది. ప్రస్తుతం బంగారం ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి కాగా, వెండికి
మాత్రం స్వచ్ఛంద విధానం అమల్లో ఉంది. అయితే, వెండి హాల్మార్కింగ్ను తప్పనిసరి చేసేముందు అవసరమైన మౌలిక సదుపాయాలు, పరీక్షా కేంద్రాల సామర్థ్యం, నియంత్రణ వ్యవస్థలు సరిపోతాయా అనే అంశాలను పరిశీలిస్తున్నట్లు బీఎస్ఐ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్డ్ తెలిపారు.
వెండికి హాల్మార్కింగ్ 2005 నుంచి స్వచ్ఛందంగా అమలవుతోంది.. 2025 సెప్టెంబర్ నుంచి సిల్వర్ ఆర్టికల్స్ స్వచ్ఛతకు సంబంధించి హాల్మార్క్ విశిష్ఠ గుర్తింపు (యూహెచ్ఐడీ) సంఖ్యను అమల్లోకి తెచ్చింది. అయితే, మారుమూల ప్రాంతాల్లోని చిన్న దుకాణాల్లోనూ వెండి ఆభరణాలు విక్రయిస్తున్న క్రమంలో వీటికి హాల్మార్క్ అమలు చేయడం సవాలుతో కూడుకున్నదని సంజయ్ గార్గ్ పేర్కొన్నారు.
BIS ఈ విధానాన్ని ఒకేసారి అమలు చేయకుండా దశలవారీగా ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలిస్తోంది. వినియోగదారులకు స్వచ్ఛమైన వెండి అందించడం, నకిలీ, నాసిరకం వెండి విక్రయాలను తగ్గించడం, మార్కెట్లో పారదర్శకతను పెంచడమే లక్ష్యమని సంజయ్ గార్డ్ తెలిపారు. ప్రస్తుతం వెండి ఆభరణాలను పరీక్షించేందుకు బీఐఎస్ గుర్తింపు పొందిన అసేయింగ్, హాల్మార్కింగ్ సెంటర్లు సుమారు 230 ఉన్నాయి. 2024-25లో 32లక్షల వెండి ఆభరణాలకు హాల్మార్క్ వేయగా, 2025-26లో ఈసంఖ్య 59 లక్షలకు పెరిగినట్లు తెలిపారు.
వెండికి హాల్మార్కింగ్ తప్పనిసరిగా అమలైతే.. వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుంది. వెండి స్వచ్ఛతపై హామీ లభిస్తుంది. నకిలీ లేదా నాసిరకం వెండి విక్రయాలు తగ్గుతాయి. మార్కెట్లో పారదర్శకత, వినియోగదారుల నమ్మకం పెరుగుతుంది.