
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపై సస్పెన్స్ త్వరలోనే వీడనున్నట్లు తెలుస్తోంది.
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్లో తాను బరిలోకి దిగబోతున్నట్లు ఈ యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సోషల్ మీడియా వేదికగా ఒక స్ట్రాంగ్ హింట్ ఇచ్చాడు. ఐపీఎల్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న వైభవ్కు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు పిలుపు వచ్చినప్పటికీ, ఇప్పటివరకు తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. అయితే, వరుసగా బెంచ్కే పరిమితం అవుతున్న తరుణంలో అతడు పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారత జట్టు మేనేజ్మెంట్ సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లతో కూడిన టాప్ ఆర్డర్ను నమ్ముకోవడంతో వైభవ్ నిరీక్షణ సుదీర్ఘంగా సాగింది. ఐర్లాండ్ పర్యటనతో పాటు ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ20 వరకు అతడిని పక్కన పెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఆసక్తికరమైన ఫొటోను షేర్ చేశాడు. గతంలో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై తాను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఫొటోను పెట్టి.. దానికి న్యూ చాప్టర్ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇంగ్లాండ్తో జరగబోయే రెండో టీ20 మ్యాచ్తోనే తన అంతర్జాతీయ కెరీర్ అనే కొత్త అధ్యాయం మొదలుకాబోతోందని అతడు పరోక్షంగా హింట్ ఇచ్చినట్లు అభిమానులు భావిస్తున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఈ నిర్దిష్టమైన ఫొటోను ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలింగ్ దాడిని ఒంటి చేత్తో బ్రేక్ చేసిన వైభవ్.. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగుల నమ్మశక్యం కాని ఇన్నింగ్స్తో భారత్కు ప్రపంచకప్ అందించి హీరోగా నిలిచాడు. ఈరోజు సీనియర్ జట్టు తరఫున తలపడబోయేది కూడా అదే ఇంగ్లాండ్ జట్టుతో కావడం విశేషం. తన పాత బాదుడును గుర్తుచేసుకుంటూ పెట్టిన ఈ పోస్ట్ చూస్తుంటే, మాంచెస్టర్ మ్యాచ్లో అతడి డెబ్యూ దాదాపు ఖాయమైందని, అందుకే నెట్స్లో దీనికి సంబంధించిన సంకేతాలు అతడికి అంది ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ కనుక తుది జట్టులోకి వస్తే, ఎవరిపై వేటు పడుతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఓపెనర్ అభిషేక్ శర్మ గత మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ చేయడంతో అతడి స్థానానికి ఎలాంటి డోకా లేదు. కానీ, టాప్ ఆర్డర్లో ఆడుతున్న సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ గత కొన్ని మ్యాచ్లుగా ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో సంజూ కేవలం 1 పరుగుకే అవుట్ అవ్వగా, ఇషాన్ కిషన్ కనీసం ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. అంతకుముందు ఐర్లాండ్ టూర్ లోనూ రెండు మ్యాచ్ల సిరీస్లో సంజూ 5 పరుగులు, ఇషాన్ 13 పరుగులు మాత్రమే చేసి దారుణంగా నిరాశపరిచారు.
ఐర్లాండ్ చేతిలో భారత్ 2-0తో ఘోరంగా సిరీస్ ఓడిపోయినప్పటికీ, మొదటి టీ20లో మేనేజ్మెంట్ పాత ఆటగాళ్లకే మళ్లీ అవకాశం ఇచ్చింది. చేస్టర్-లే-స్ట్రీట్లో జరిగిన ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. లీన్ ప్యాచ్లో ఉన్నప్పటికీ సంజూ, ఇషాన్లకు మద్దతు ఇస్తామని మేనేజ్మెంట్ మాట మాత్రంగా చెబుతున్నప్పటికీ, బెంచ్పై వైభవ్ లాంటి సూపర్ ఫామ్లో ఉన్న హిట్టర్ అందుబాటులో ఉన్నప్పుడు జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే కీలక మ్యాచ్లో సంజూ లేదా ఇషాన్ ఇద్దరిలో ఒకరిని పక్కన పెట్టి వైభవ్కు క్యాప్ అందించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి