
Heavy Rain Alert : ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అయితే ఈ అల్పపీడనం ఒకటి రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇదే పరిస్థితులు కొనసాగితే అల్పపీడనం కాస్త వాయుగుండం, తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ తుపాను ఏర్పడితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలం తప్పదు... ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు దూసుకువచ్చి కుండపోత వర్షాలను, బలమైన ఈదురుగాలులతో బీభత్సం సృష్టించవచ్చు. అయితే అల్పపీడనం తుపాను గా మారుతుందా లేదా అన్నదానిపై నాలుగైదు రోజుల్లో క్లారిటీ రానుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు కురుస్తున్నాయి. ఇవాళ (జూలై 4, శనివారం) కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA)హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంద్ర జిల్లాలు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం లలో కుండపోత వర్షాలు కురుస్తాయంటోంది. ఇక పోలవరం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని APSDDMA హెచ్చరించింది.
ఏలూరు జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తు సంస్థ హెచ్చరిస్తోంది. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన చెదురుమదురు వానలు పడే అవకాశాలు ఉన్నాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా గట్టిగానే ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి... రాబోయే 24 గంటలు ఈ వర్షాలు కొనసాగనున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రకటించారు. మిగతా ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే ఆకాశం మేఘాలతో కమ్మేసి ముసురు వాతావరణం కొనసాగుతుందని తెలిపారు. మధ్యాహ్నం మెళ్లిగా జల్లులు మొదలవుతాయని... సాయంత్రం, రాత్రి వర్షతీవ్రత కాస్త పెరిగే అవకాశాలున్నాయని వెల్లడించారు. అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
తెలంగాణలో ఇక అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని... వరద పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించింది. ఈ వర్షాలకు ఈదురుగాలులు కూడా తోడవుతాయని... గంటకు 40 నుండి 50 కిలోమీటర్లు, కొన్నిచోట్ల 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఈ గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... వర్ష సమయంలో చెట్లకింద ఉండరాదని, పెద్దపెద్ద హోర్డింగ్, ప్లెక్పీలు, విద్యుత్ స్తంబాలకు దూరంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.