
కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్న ఎలైట్ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చారు
. ఈ కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంది.ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ క్రీడాకారులతో ఆత్మీయంగా సంభాషించి, వారి శిక్షణ, సన్నాహక కార్యక్రమాలు, భవిష్యత్తు లక్ష్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై అత్యుత్తమ ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు, శిక్షణ అవకాశాల పట్ల క్రీడాకారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. క్రీడలకు మరియు క్రీడాకారులకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సహా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) అందిస్తున్న సహకారానికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.