Siddipet Man Jailed 20 Years : కొవిడ్ లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ క్లాసుల్లోనే చాలా మంది విద్యను అభ్యసించారు. ఇదే అదునుగా చేసుకున్న ఓ యువకుడు..
ఓ 11 ఏళ్ల మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్ వేదికగా వల విసిరాడు. తరచుగా మెసేజ్లు చేస్తూ.. ఇబ్బంది పెట్టాడు. బ్లాక్ చేస్తే ఎలాగోలా ఆమె నంబర్ సంపాదించి ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఇంట్లో డబ్బులు తీసుకుని తన చెప్పిన చోటుకు రావాలని.. లేదంటే మీ అమ్మను చంపేస్తానంటూ బెదిరించాడు. భయపడిపోయిన బాలికి అతడు చెప్పినట్లు పిలిచిన చోటుకు వెళ్లింది. ఇలా ఆమెను కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడా నిందితుడు. తాజాగా ఈ నేరం రుజువు కావడంతో.. రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పొక్సో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం. ఆన్లైన్ క్లాసుల వేళ.. అభ్యంతరకర మెసేజీలు చేస్తూ!సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన 29 ఏళ్ల వెంకటస్వామి.. 2020లో ‘వెంకీ దగడ్’ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఐడీని సృష్టించాడు. అదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంట్లో ఉంటూ.. తన నాన్నమ్మ మొబైల్ ఫోన్లో ప్రతిరోజూ ఆన్లైన్ పాఠాలు వింటున్న 11 ఏళ్ల మైనర్ బాలికకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపాడు. ఆ చిన్నారి తెలియక ఆ మెసేజ్కు రిప్లై ఇచ్చింది. దీనిని ఆసరాగా చేసుకున్న వెంకటస్వామి.. రోజురోజుకూ ఆ బాలికకు అసభ్యకరమైన సందేశాలు పంపడం ప్రారంభించాడు. దీంతో విసిగిపోయిన సదరు బాలిక.. నిందితుడి ఇన్స్టాగ్రామ్ ఐడీని బ్లాక్ చేసింది."అమ్మను కిడ్నాప్ చేస్తా" అంటూ ఘోరమైన బ్లాక్మెయిల్..సోషల్ మీడియాలో బ్లాక్ చేయడంతో సైకోగా మారిన వెంకటస్వామి.. ఎలాగోలా బాలిక ఫోన్ నంబర్ సంపాదించి నేరుగా కాల్స్ చేయడం మొదలు పెట్టాడు. 2020 డిసెంబర్ 2వ తేదీన బాలికకు ఫోన్ చేసి.. ఇంట్లో ఉన్న డబ్బులు దొంగిలించుకుని ఘట్కేసర్కు రావాలని ఆర్డర్ వేశాడు. ఒకవేళ రాకపోతే మీ అమ్మను కిడ్నాప్ చేసి చంపేస్తానంటూ ఘోరంగా బెదిరించాడు. దీంతో తీవ్రంగా భయపడిపోయిన చిన్నారి.. తన అమ్మను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో.. తన తల్లి పర్సులో ఉన్న రూ.18,000 నగదు తీసుకుని ఒంటరిగా ఘట్కేసర్కు చేరుకుంది. అప్పటికే అక్కడ మాటు వేసిన వెంకటస్వామి.. బాలికను బలవంతంగా కిడ్నాప్ చేసి ఏఎస్ రావు నగర్లోని తన స్నేహితుడి గదికి తీసుకెళ్లి పాశవికంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.చాకచక్యంగా లొకేషన్ పంపిన బాలిక.. కోర్టులో న్యాయం!అయితే వెంకటస్వామి గది బయటకు వెళ్లిన తరుణంలో.. బాలిక అత్యంత చాకచక్యంగా తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా తల్లి మొబైల్కు వాట్సాప్ లొకేషన్ పంపించింది. దీంతో ఆందోళనతో వెతుకుతున్న తల్లి వెంటనే మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు లొకేషన్ ఆధారంగా ఆ ఇంటికి చేరుకుని బాలికను రక్షించారు. అలాగే వెంకట స్వామిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ దారుణ ఉదంతంపై సుదీర్ఘంగా విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ పొక్సో కోర్టు న్యాయమూర్తి,..నేరం రుజువు కావడంతో నిందితుడు వెంకట స్వామికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.19,000 జరిమానా విధించారు. అంతేకాకుండా బాధితురాలి మానసిక, శారీరక క్షోభను పరిగణనలోకి తీసుకుని.. ప్రభుత్వ రూ.2 లక్షల అత్యవసర నష్టపరిహారాన్ని మంజూరు చేయాలని ఆదేశించారు.