
పేదలకు అండగా ఉంటూ సంక్షేమం అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu,) అన్నారు. పేదరిక నిర్మూలనకు అందరూ కృషి చేయాలని , 4పీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్లను సీఎం అందజేశారు. పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు (DWCRA Groups) దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలి. అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్ పార్క్ గూడూరు (Gudur)లో వస్తోంది. పది వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు అని అన్నారు.