
పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్కు లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు...
పూణే రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితురాలు సియా గోయల్కు లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. కేతన్ను లోయలోకి తోసింది ఎవరో నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యాలు లేవని కోర్టుకు తెలిపారు. ఈ పరీక్ష ద్వారా దర్యాప్తునకు ఉపయోగపడే కొత్త సమాచారం లభించే అవకాశం ఉందని వివరించారు.సియా గోయల్, చేతన్ చౌదరి వాంగ్మూలాలు ఇప్పటికే నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వాటితోనే కేసును నిర్ధారించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందుకే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని కోర్టుకు విన్నవించారు. ఈ పరీక్ష ఫలితాలు కోర్టులో ప్రత్యక్ష సాక్ష్యాలుగా పరిగణించకపోయినా దర్యాప్తునకు కొత్త ఆధారాలు సేకరించేందుకు ఉపయోగపడతాయని పోలీసులు వెల్లడించారు.జూన్ 18న లోహగడ్ కోట వద్ద కేతన్ను హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఘటన తర్వాత కొంతసేపు కేతన్ మొబైల్ సియా వద్దే ఉందని గుర్తించారు. ఆ సమయంలో అందులోని కీలక సమాచారం తొలగించారా అనే కోణంలో ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఘటనను పోలీసులు రీక్రియేట్ చేశారు. సియా, చేతన్ ఇద్దరూ జులై 3 వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు.