
ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగని మాంసాహారులకు చికెన్ ప్రియమైపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.
గత వారం రోజులుగా మార్కెట్లో రేట్లు క్రమంగా పెరుగుతూ సామాన్యుడి బడ్జెట్‌కు చిల్లు పెడుతున్నాయి. గత వారం రోజు క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయించగా.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రూ.300 నుంచి రూ.330 వరకు అమ్ముతున్నారు.అటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలోనూ కేజీ చికెన్ ధర రూ.320 నుంచి రూ.335 పలుకుతోంది. చికెన్‌తో పాటే నిత్యం ప్లేటులో ఉండే కోడిగుడ్డు ధర సైతం సామాన్యుడికి భారంగా మారింది. నెల రోజుల కిందట రూ.6 నుంచి రూ.7 పలికిన కోడిగుడ్డు ధర.. ప్రస్తుతం హోల్‌సేల్ షాపుల్లోనే ఏకంగా రూ.8కి చేరింది.ఎండల దెబ్బకు తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన డిమాండ్!చికెన్, గుడ్ల ధరలు ఈ రేంజ్‌లో పెరగడానికి ప్రధాన కారణం పౌల్ట్రీ ఫారాలపై వాతావరణ ప్రభావం పడటమేనని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోత కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు భారీగా పెరిగాయి. ఎండల తీవ్రతను తట్టుకోలేక బ్రాయిలర్ కోళ్లు చనిపోవడంతో పాటు, లేయర్ కోళ్లు గుడ్లు పెట్టే సామర్థ్యం (ఉత్పత్తి) కూడా గణనీయంగా పడిపోయింది. మార్కెట్లో సప్లై తగ్గడం.. అదే సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ కావడంతో చికెన్, గుడ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఈ సరఫరా, డిమాండ్ల మధ్య ఉన్న వ్యత్యాసమే ధరల పెరుగుదలకు ముఖ్య కారణమైంది. ఇరాన్‌లో ఒక గుడ్డు ధర అక్షరాలా.. : ఆధునిక కరువు అంటే ఇదేనా?కోళ్ల మేత ధరలు పెరగడం మరో శాపం!పౌల్ట్రీ రంగాన్ని వేధిస్తున్న మరో ప్రధాన సమస్య కోళ్ల మేత (Poultry Feed) ధరలు పెరగడం. కోళ్లకు ప్రధాన ఆహారంగా వేసే సోయాబీన్, జొన్నలు, మొక్కజొన్నల ధరలు బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగాయి. దీనికి తోడు రవాణా ఖర్చులు, పౌల్ట్రీ ఫారాల నిర్వహణ వ్యయం (కూలీలు, మందుల ఖర్చులు) కూడా అధికమవడంతో కోళ్ల పెంపకం రైతులకు భారంగా మారింది. పెట్టుబడి వ్యయం పెరగడంతో ఆ భారాన్ని ఉత్పత్తిదారులు, వ్యాపారులు వినియోగదారులపై వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాటు గుడ్డు..ఫారం గుడ్డు - ఆరోగ్యకర పోషకాలు ఎందులో ఎక్కువ..!?హోటళ్లు, కర్రీ పాయింట్లపై ప్రభావం..ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లపై కూడా తీవ్రంగా పడింది. చికెన్ బిర్యానీలు, చికెన్ కర్రీల ధరలను పెంచేందుకు హోటల్ నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. గుడ్డు ధర ఏకంగా రూ.8 పలకడంతో సామాన్యులు ఉపాధిగా నడుపుకునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లలో ఎగ్ రైస్, ఎగ్ కర్రీల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. వాతావరణం పూర్తిగా చల్లబడి, కొత్త బ్యాచ్ కోళ్లు మార్కెట్లోకి వచ్చే వరకు ఈ ధరల మంట ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.