
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు కూల్ న్యూస్.. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడబోతున్న అల్పపీడన ప్రభావంతో జూలై 8వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతోపాటు.. రుతుపవనాలు కూడా చురుకు మారే అవకాశం ఉందని అంచనా వేసింది.. వాతావరణ కేంద్రం ప్రకారం.. ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని శుక్రవారం (జూలై 3) బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది క్రమంగా రాజస్థాన్ వైపు పయనిస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల జూలై 4 నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు ప్రారంభమై.. జూలై 5 నుంచి రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలకు వర్షాలు విస్తరించే అవకాశం ఉందని అంచనా వేసింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.. గురువారం (జూలై 2) నాడు, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మేఘావృతమైన ఆకాశం ఉంటుంది.. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని #APSDMA వెల్లడించింది. జూలై 4 నుంచి వర్షాల తీవ్రత పెరిగి, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది..
అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. రాజధాని హైదరాబాద్ సహా పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నగర ప్రజలు ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అన్నదాతలు వరుణ దేవుడి కోసం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. మొత్తంగా జూలై 4 (శనివారం) నుంచి జూలై 8 (బుధవారం) వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. ఉరుములు పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..