ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. ప్రస్తుతం స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) 07219 ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ...
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు రైల్వేశాఖ తీపికబురు చెప్పింది. ప్రస్తుతం స్పెషల్ రైలుగా నడుస్తున్న నరసాపురం– అరుణాచలం (తిరువణ్ణామలై) 07219 ఎక్స్ప్రెస్ ఇక రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ నడవనుంది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ తొలి రెగ్యులర్ సర్వీస్ను భీమవరం టౌన్ రైల్వేస్టేషన్లో లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. గతేడాది జులై 9న తిరువణ్ణామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరగడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చాలని కోరగా గ్రీన్సిగ్నల్ వచ్చింది. జులై 10 నుంచి నరసాపురం–బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రజలు, భక్తుల కోరిక మేరకు నరసాపురం - అరుణాచలం (తిరువణ్ణామలై) వీక్లీ ఎక్స్ప్రెస్ను రెగ్యులర్ సర్వీస్గా ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. భక్తులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యమన్నారు. గతేడాది ఏడాది జులై 9న స్పెషల్ రైలుగా ప్రారంభమైన ఈ సర్వీస్కు విశేష స్పందన (110% ఆక్యుపెన్సీ) వచ్చిందన్నారు. అందుకే రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి దీనిని పూర్తిస్థాయి రెగ్యులర్ రైలుగా అనుమతులు సాధించామన్నారు. జులై 10 నుంచి నరసాపురం - బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి వస్తుందన్నారు.అలాగే నర్సాపురం - విశాఖపట్నం రైలు, నర్సాపురం - వారణాసి డైరెక్ట్ ట్రైన్ సదుపాయం, తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్ప్రెస్కు హాల్ట్ సాధించామన్నారు భూపతిరాజు శ్రీనివాసవర్మ. అమృత్ స్టేషన్ పథకంలో భీమవరం టౌన్, తాడేపల్లిగూడెం, నరసాపురం స్టేషన్ల అత్యాధునిక ఆధునీకరణ పనులు పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో మరే ఇతర పార్లమెంట్ నియోజకవర్గంలో లేని విధంగా నరసాపురం పార్లమెంట్లో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రతి బుధవారం ఈ రైలు నరసాపురంలో మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బయల్దేరి పాలకొల్లు, వీరవాసరం, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు రోడ్డు మీదుగా తిరువణ్ణామలైకు మరుసటి రోజు ఉదయం 4.35 గంటలకు చేరుకుంటుంది.