
మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైటెక్ డ్రోన్ పోలీసింగ్ను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సరూర్నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
హైదరాబాద్, జులై 1 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో పోలీసులు హైటెక్ డ్రోన్ పోలీసింగ్ను మరింత విస్తృతంగా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా సరూర్నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. గంజాయి సేవించడం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. సరూర్నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో కొంతమంది యువకులు గుంపులుగా చేరి గంజాయి సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా అనుమానాస్పద ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.
తాజాగా డ్రోన్ నిఘాలో భాగంగా ఓ ఆటోలో కూర్చుని గంజాయి సేవిస్తున్న కొందరు యువకులు పోలీసుల దృష్టికి వచ్చారు. డ్రోన్ ద్వారా అందిన ప్రత్యక్ష దృశ్యాలను పరిశీలించిన అధికారులు వెంటనే సంబంధిత పోలీసు బృందాలకు సమాచారం అందించారు. అలర్ట్ అయిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గంజాయి సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సాధారణంగా గుర్తించడం కష్టమయ్యే ప్రాంతాల్లో కూడా డ్రోన్ గస్తీ వల్ల నిఘా సాధ్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. చెరువులు, పార్కులు, ఖాళీ ప్రదేశాలు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తున్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించిన మల్కాజిగిరి పోలీసులు, డ్రోన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ నేర నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారు. గంజాయి విక్రయం, వినియోగం, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో మరిన్ని ప్రాంతాలకు డ్రోన్ నిఘాను విస్తరించే యోచనలో పోలీసులు ఉన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించి మాదకద్రవ్యాల నిర్మూలన, ప్రజా భద్రత పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు.
మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోల కలకలం
విద్యార్థులకు ఊరట.. ఫీజువసూళ్లపై హైకోర్టు స్టే కొనసాగింపు
Read Latest AP News And Telangana News And National News