ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో గ్లోబల్ హబ్గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగర కీర్తికిరీటంలో మరో కీలక పడబోతోంది. దేశంలోనే అతిపెద్ద టెలికాం, డిజిటల్ సేవల సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తన రెండో ప్రధాన...
ఐటీ, కమ్యూనికేషన్ రంగాల్లో గ్లోబల్ హబ్గా దూసుకుపోతున్న హైదరాబాద్ నగర కీర్తికిరీటంలో మరో కీలక పడబోతోంది. దేశంలోనే అతిపెద్ద టెలికాం, డిజిటల్ సేవల సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తన రెండో ప్రధాన కార్యాలయాన్ని భాగ్యనగరంలో ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ విషయాన్ని భారతీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ స్వయంగా వెల్లడించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ బోధి పెవిలియన్లో మంగళవారం (జూన్ 30) ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డితో సునీల్ భారతీ మిత్తల్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులు, డిజిటల్ మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగంలో తీసుకొస్తున్న విప్లవాత్మక సంస్కరణలను సీఎం రేవంత్ రెడ్డి సునీల్ మిత్తల్కు వివరించారు. అనంతరం పారిశ్రామిక ప్రగతిపై చర్చిస్తూ.. రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఎయిర్టెల్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న డేటా సెంటర్ ప్రాజెక్టు పనులను వీలైనంత త్వరగా ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం కోరారు. దాంతో పాటు తెలంగాణలో మరింత భారీ ఎత్తున సమగ్ర డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల క్యాంపస్ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. హైదరాబాద్ వేదికగా ఎయిర్టెల్ డిజిటల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ కార్యకలాపాలను విస్తరించాలని సీఎం రేవంత్ కోరారు. భవిష్యత్ పెట్టుబడులు, అనుమతుల ప్రక్రియలో తలెత్తే సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకునేలా ఎయిర్టెల్ తరఫున ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ను నామినేట్ చేయాలని సూచించారు.ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై సునీల్ భారతీ మిత్తల్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంపై తాము ఆసక్తితో ఉన్నామని తెలిపారు. సామాజిక బాధ్యతలో భాగంగా.. భారతీ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో చదువుకునే ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామని సునీల్ మిత్తల్ ప్రకటించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.