యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్సన్ టు వ్యాపారి మధ్య జరిగే లావాదేవీలపై డిస్కౌంట్ మర్చంట్ రేటు(MDR) ఛార్జీలు అమల్లోకి తెస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అక్టోబర్ 15వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. పర్సన్ టు వ్యాపారి మధ్య జరిగే రూ.2 వేలకుపైబడి పేమెంట్లపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధించింది. ఇక రైల్వే టికెట్ల బుకింగ్, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధన చెల్లింపులపై రూ.5 ఛార్జీ ఉంటుంది. రూ.2 వేలలోపు లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఇక పర్సన్ టూ పర్సన్ మధ్య జరిగే లావాదేవీలు పూర్తిగా ఉచితం. అయితే ఎండీఆర్ ఛార్జీలు అనేవి కస్టమర్లు చెల్లించాల్సిన పని లేదు. మీ నుంచి డబ్బు స్వీకరించడానికి వ్యాపారి దీనిని బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రజలపై ఎలాంటి భారం పడదని కేంద్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ ఛార్జీలు చెల్లించాల్సిందిగా కస్టమర్లను వ్యాపారులు బలవంతపెట్టకూడదు.