
ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆహార భద్రత విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఇటీవల వార్తల్లో నిలిచారు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ చీఫ్‌ తుకారాం ముండే. తాజాగా ఆసుపత్రుల్లో ఔషధాలు, ఇతర ఉత్పత్తుల ధరల్లో భారీ వ్యత్యాసాలపై ఆయన చేసిన పోస్ట్‌ నెట్టింట చర్చనీయాంశమైంది. చికిత్స సమయంలో రోగులకు అందించే కొన్ని ఔషధాల తయారీ ఖర్చులు నామమాత్రంగా ఉంటున్నప్పటికీ.. వాటిని చాలా రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఆయన (Tukaram Mundhe) వెల్లడించారు. దీని వల్ల సామాన్య పౌరులపై అధిక భారం (Hospital Bills) పడుతోందని పేర్కొన్నారు. మహారాష్ట్ర ( Maharashtra ) ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) ఆధ్వర్యంలోని స్టేట్‌ ప్రైస్‌ మానిటరింగ్‌ రిసోర్స్‌ యూనిట్‌ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఔషధాల ధరలపై సర్వే నిర్వహించింది. ఇందులో బయటపడిన కొన్ని వాస్తవాలను తుకారాం ముండే తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘‘ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రోగికి కొన్ని ఔషధాలు అందిస్తారు. వాటి తయారీ ధర ఎంత ఉంటుందో మనకు కనీస అవగాహన కూడా ఉండదు. ప్యాకెట్‌పై రేటు మాత్రమే కన్పిస్తుంది. అది అసలైందో.. మార్చిన ధరో తెలియదు. ఈ సమాచార లోపమే.. అసలైన ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇటీవల నిర్వహించిన సర్వేలో.. ఒక ఐవీ ఇన్‌ఫ్యూషన్‌ సెట్‌ తయారీ ధర రూ.11.05 అని తెలిసింది. కానీ, ప్యాకెట్‌పై ఎంఆర్‌పీ మాత్రం రూ.325 అని ఉంది. అంటే 2841శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక, సిరంజీ తయారీ ధర రూ.6.75 అయితే.. రూ.57.20కి అమ్ముతున్నారు. మూత్రం పైపు అసలు ధర రూ.29.41 ఉంటే.. ఎంఆర్‌పీ రూ.310గా ఉంటోంది’’ అని తుకారాం వెల్లడించారు. ‘‘ఇవి ఎంపిక చేసుకుని కొనుగోలు చేసే వస్తువులు కాదు. చికిత్స సమయంలో వీటి ధరలను ఎవరూ ప్రశ్నించరు. సాధారణంగా ఈ ఎంఆర్‌పీని తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లే నిర్ణయిస్తారు. వారు సామాన్యులకు అందుబాటులో ఉండరు కదా..! అంతిమంగా ప్రజలే ఈ అధిక ఖర్చులు భరించాల్సి వస్తోంది’’ అని తుకారం రాసుకొచ్చారు. ఈ ధరలు చాలా అహేతుకంగా, అన్యాయంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. స్టార్‌ హీరోలకు నోటీసులతో పాటు పలు ప్రముఖ ఫుడ్‌ అవుట్‌లెట్లను సీజ్‌ చేయడంతో తుకారం ముండే పేరు ఇటీవల దేశవ్యాప్తంగా మార్మోగింది. ఆయన ఆధ్వర్యంలోని ఎఫ్‌డీఏ తాజాగా ఓ ప్రముఖ కేఫ్‌ లైసెన్స్‌ను సస్పెండ్‌ చేసింది. అపరిశుభ్రత, ఆహార పదార్థాల్లో నాణ్యత లేని కారణంగా మొండేగర్‌ కేఫ్‌ లైసెన్స్‌ను నిలిపివేసింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





