
Stock Market : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Markets) బుధవారం కోలుకున్నాయి. వరుసగా రెండు రోజుల నష్టాల తర్వాత సూచీలు లాభాల్లో ముగిశాయి. ఎఫ్ఎంసీజీ (FMCG), రియల్టీ (Realty), ప్రభుత్వ రంగ బ్యాంకుల (Public Sector Banks) షేర్లలో కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed Reserve) వడ్డీ రేట్ల నిర్ణయానికి ముందు చమురు ధరలు (Oil price) తగ్గడం కూడా మదుపర్ల సెంటిమెంట్ను బలపరిచింది. సెన్సెక్స్ 332.63 పాయింట్లు లాభపడి 74,336.45 వద్ద ముగిసింది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 23,217.60 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. అయితే మార్కెట్లో మొత్తం కొనుగోళ్ల జోరు కనిపించలేదు. నిఫ్టీ మిడ్క్యాప్ సూచీ 0.01 శాతం స్వల్పంగా తగ్గింది. స్మాల్క్యాప్ సూచీ 0.18 శాతం నష్టపోయింది. రంగాల వారీగా ఎఫ్ఎంసీజీ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ సూచీలు లాభాల్లో ముందున్నాయి. ఐటీ, ఫార్మా సూచీలు ఎక్కువగా నష్టపోయాయి. నిఫ్టీకి 23,300-23,400 స్థాయిలో నిరోధం ఉందని మార్కెట్ నిపుణులు తెలిపారు. 23,500 పైన నిలకడగా ఉంటే సూచీ పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దిగువన 23,100-23,070 స్థాయిని కీలక మద్దతుగా చూస్తున్నారు. 23,070 కిందకు పడితే అమ్మకాల ఒత్తిడి పెరిగి 23,000-22,800 స్థాయులకు చేరే అవకాశం ఉందని తెలిపారు. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపైనే మదుపర్ల దృష్టి ఉంది. వడ్డీ రేట్లపై ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లలో నగదు లభ్యత, పెట్టుబడుల ప్రవాహం, సమీపకాల మార్కెట్ దిశను ప్రభావితం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు.





